ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో ఆడుతోన్న భారత జట్టుకు గుడ్న్యూస్ అందింది. గాయం బారిన పడ్డ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సూచనప్రాయంగా వెల్లడించింది. నెదర్లాండ్స్తో జరిగే మ్యాచ్ నాటికి అతను జట్టుకు అందుబాటులోకి వస్తాడని పేర్కొంది.
టీమిండియా తన తదుపరి మ్యాచ్ను నవంబర్ 2వ తేదీన ఆడబోతోంది. శ్రీలంకను ఎదుర్కొనబోతోంది. ముంబైలోని వాంఖెడె స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 2 గంటలకు ఈ పోరు ఆరంభమౌతుంది. శ్రీలంకపైనా టీమిండియా ఇదే దూకుడును కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇది కాకుండా ఇంకో రెండు మ్యాచ్లను టీమిండియా ఆడాల్సి ఉంది. ఒకటి- దక్షిణాఫ్రికాతో ఈ నెల 5వ తేదీన కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్లో, రెండవది- 12వ తేదీన నెదర్లాండ్స్తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో. ఈ రెండింటితో గ్రూప్ దశ ముగుస్తుంది. భారత్- నెదర్లాండ్స్ మధ్య జరిగేదే.. ఈ టోర్నమెంట్ మొత్తానికీ చిట్టచివరి గ్రూప్ మ్యాచ్.
దీని తరువాత 15, 16 తేదీల్లో రెండు సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. 19వ తేదీన ఫైనల్ ఉంటుంది. దీనికి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యాన్ని ఇస్తుంది. టీమిండియా సెమీ ఫైనల్స్ బెర్త్ దాదాపుగా కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో- హార్దిక్ పాండ్యాను నేరుగా ఆ మ్యాచ్లల్లోనే ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ తొలుత నిర్ణయించింది.
ఆ తరువాత తన నిర్ణయాన్ని మార్చుకుంది. గాయపడి కోలుకున్న తరువాత నేరుగా సెమీ ఫైనల్స్ ఆడించడం కంటే కూడా నెదర్లాండ్స్పై ఆడే తుదిజట్టులోకి తీసుకోవాలని తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది వామప్స్గా అతనికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం హార్దిక్ పాండ్యా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్లో ఉంటోన్నాడు. గాయం నుంచి క్రమంగా కోలుకుంటోన్నాడు. నెదర్లాండ్స్తో మ్యాచ్ కూడా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే షెడ్యూల్ కావడం వల్ల నేరుగా అతన్ని జట్టుతో కలుస్తాడు.