Aishwarya Rai: ఐసీసీ వరల్డ్ కప్ 2023లో ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోయిన జట్లు ఏవైనా ఉన్నాయంటే అవి- ఇంగ్లాండ్, పాకిస్తాన్. నాసిరకం ఆటతీరును ప్రదర్శించాయి ఆ రెండు జట్లూ. అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఈ రెండూ గతంలో వరల్డ్ కప్ ఛాంపియన్గా నిలిచినవే.
సెమీ ఫైనల్స్ చేరకుండానే తిరుగుముఖం పట్టిన పాకిస్తాన్ జట్లు పట్ల స్వదేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తమౌతోన్నాయి. మాజీ క్రికెటర్లు దుమ్మెత్తి పోస్తోన్నారు. వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్.. వంటి మాజీలు ఓ అడుగు ముందుకేశారు. ఫిట్నెస్ పట్లా ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు.

ఈ పరిణామాలపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అబ్దుల్ రజాక్ స్పందించాడు. కరాచీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, మిస్బా ఉల్ హక్, సల్మాన్ బట్, మరికొందరితో కలిసి పాల్గొన్నారు. అక్కడే విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
పాకిస్తాన్ జట్టు సెమీ ఫైనల్స్ చేరపోవడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు అబ్దుల్ రజాక్ స్పందించాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు సంధికాలంలో ఉన్నట్లు తనకు అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. కేప్టెన్.. ఎప్పుడూ జట్టుకు స్ఫూర్తినిచ్చేలా ఉండాలని వ్యాఖ్యానించాడు. తాను జాతీయ జట్టులో ఆడేటప్పుడు యూనిస్ ఖాన్.. ఎంతగానో ప్రోత్సహించేవారని గుర్తు చేశాడు.
యూనిస్ ఖాన్ తన ఆటను మెరుగుపర్చుకోవడానికి అనేక సలహాలను ఇచ్చాడని అబ్దుల్ రజాక్ వివరించాడు. అవి తనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచేవని పేర్కొన్నాడు. ఇప్పుడు అలాంటి వాతావరణం తనకు జాతీయ జట్టులో కనిపించట్లేదని, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించాడు.
ఆటగాళ్ల నైపుణ్యాలను పెంపొందించడం, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందింపజేయడం, దేశం పట్ల, క్రికెట్ పట్ల అంకితభావం ఆడటం నేర్పించాలని అబ్దుల్ రజాక్ అన్నాడు. ప్లేయర్లల్లో ఆ అంకితభావమే లోపించిందని అన్నాడు. క్రికెట్పై చిత్తశుద్ధి, ప్రేమ, అంకిత భావాన్నికనపర్చకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయని పేర్కొన్నాడు.
ఇక్కడే విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఐశ్వర్య రాయ్ను ఉదహరించాడు అబ్దుల్ రజాక్. తాను ఐశ్వర్యరాయ్ను నిఖా చేసుకుని ఉంటే మంచి పిల్లలు పుడతాడని అనుకోవచ్చు.. అది జరిగేది కాదు కదా.. అని చెప్పాడు. క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటే అలాంటి ఫలితాలే వస్తాయని వివరించాడు. ఉద్దేశం బాగుండాలని, అప్పుడే సత్ఫలితాలొస్తాయని అన్నాడు.