England vs South Africa: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్. ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. ముంబై వాంఖెడే స్టేడియం వేదిక. ఈ రెండు జట్లకూ ఇది నాలుగో మ్యాచ్. మూడింట్లో రెండు విజయాలతో దక్షిణాఫ్రికా ఓ అడుగు ముందే ఉంది. మూడింట్లో రెండు పరాజయాలను చవి చూసింది ఇంగ్లాండ్.
వాంఖెడే స్టేడియంలో టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు ఇంగ్లాండ్ కేప్టెన్ జోస్ బట్లర్. అతని నిర్ణయం కరెక్టే అని తొలి ఓవర్లోనే తేలిపోయింది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది దక్షిణాఫ్రికా. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ క్వింటన్ డికాక్ అవుట్ అయ్యాడు. తొలి బంతిని ఫోర్కు తరలించి.. కాన్ఫిడెంట్గా కనిపించిన డికాక్- రెండో బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయాడు.

బౌలర్ రీస్ టోప్లే (Reece Topley) వికెట్లకు కాస్త దూరంగా సంధించిన బంతిని కవర్ డ్రైవ్ ఆడబోయాడు క్వింటన్ డికాక్. టైమింగ్ మిస్ అయ్యాడు. బ్యాట్ను ముద్దాడిన బంతిని కీపర్ జోస్ బట్లర్ అందుకున్నాడు. అంపైర్ అవుట్ ఇవ్వలేదు. బట్లర్ ఆ బంతిని అందుకోవడాని కంటే ముందే అది నేలను తాకినట్టు భావించారు.
అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో థర్డ్ అంపైర్ అప్పీల్ చేసింది ఇంగ్లాండ్. బంతి గ్రౌండ్ను తాకకముందే దాన్ని ఒడిసిపట్టుకున్నట్లు తేలడంతో అవుట్ ఇచ్చాడు థర్డ్ అంపైర్. అప్పటికి జట్టు స్కోర్ రెండు ఓవర్లల్లో వికెట్ నష్టానికి అయిదు పరుగులు.
ప్రస్తుతం రస్సీ వాన్డెర్ డుస్సాన్, రీజా హెండ్రిక్స్ క్రీజ్లో ఉన్నారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. క్రీజ్లో కుదురుకున్నాక ధాటిగా ఆడుతున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా. డుస్సాన్- 37, హెండ్రిక్స్- 40 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.
ఈ మ్యాచ్లో తొలి వికెట్ పడగొట్టిన రీస్ టోప్లే అర్ధాంతరంగా గ్రౌండ్ను వీడాడు. అతను గాయపడ్డాడు. అతని ఎడమచేతి వేలికి గాయమైంది. అసంపూర్తిగా ఉన్న అతని ఓవర్ను జో రూట్ పూర్తి చేశాడు. రస్సీ వాన్ డెర్ డస్సెన్ కొట్టిన షాట్ను అడ్డుకునే క్రమంలో టోప్లే గాయపడ్డాడు. బంతిని ఆపడానికి డైవ్ చేసినప్పుడు.. అతని వేలు నలిగిపోయింది.
ఆ నొప్పితోనే అతను ఓవర్ వేసినప్పటికీ.. రిథమ్ కోల్పోయాడు. అతను వేసిన ఓవర్ పిచ్ బంతిని డుస్సాన్ బౌండరీకి తరలించాడు. దీనితో మధ్యలోనే గ్రౌండ్ వీడాడు టోప్లే. ఇంగ్లాండ్ ఆడబోయే తరువాతి మ్యాచ్లకు టోప్లే అందుబాటులోకి ఉంటాడా? లేదా? అనేది స్కానింగ్ రిపోర్ట్ తరువాతే వెల్లడిస్తామని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది.