బెంగళూరు: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్ను 160 పరుగుల తేడాతో మట్టికరిపించింది. లీగ్ దశను విజయంతో ముగించింది. 9-0తో క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సేన.
రికార్డు సృష్టించిన టీమిండియా:ఈ విజయంతో లీగ్స్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని రికార్డును నెలకొల్పింది భారత్. ఆడిన తొమ్మిది మ్యాచ్లల్లోనూ విజయదుందుభి మోగించింది. తొమ్మిది విజయాలు 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఆ తరువాతి మూడు స్థానాలో ఉన్నాయి.

సెమీస్లో.. :ఈ నెల 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయ్యాయి. 19వ తేదీన ఫైనల్స్ ఉంటుంది. తొలి సెమీ ఫైనల్లో భారత్- న్యూజిలాండ్, రెండో సెమీస్లో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా జట్లు తలపడతాయి. ముంబైలోని వాంఖెడే స్టేడియం, కోల్కతలోని ఈడెన్ గార్డెన్స్ ఈ రెండు సెమీస్కు ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి.
క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్.. :లీగ్ దశ ముగిసిన నేపథ్యంలో- క్రికెట్ ఆస్ట్రేలియా తన వరల్డ్ కప్ 2023 టీమ్ను ప్రకటించింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లన్నింట్లోనూ అద్భుతంగా ఆడిన ప్లేయర్లతో ఈ జట్టులోకి తీసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని డిపార్ట్మెంట్లల్లో సత్తా చాటిన ప్లేయర్లతో కూడి తుదిజట్టు ఇది. దీనికి విరాట్ కోహ్లీని కేప్టెన్గా అపాయింట్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా
జట్టు కూర్పు ఇలా:ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్, టాప్ ఆర్డర్ బ్యాటింగ్లో రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీని తీసుకుంది. మిడిలార్డర్లో ఎయిడెన్ మార్క్రమ్కు చోటు కల్పించింది. ఆల్ రౌండర్ల జాబితాలో గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కొ జెన్సెన్, రవీంద్ర జడేజాలకు స్థానం ఇచ్చింది క్రికెట్ ఆస్ట్రేలియా.
12 ప్లేయర్గా.. :స్పెషలిస్ట్ బౌలర్లుగా మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, జస్ప్రీత్ బుమ్రాలకు తుదిజట్టులో తీసుకుంది. 12వ ప్లేయర్గా శ్రీలంకకు చెందిన దిల్షాన్ మదుశంకను ఎంపిక చేసింది. మదుశంక ఈ టోర్నమెంట్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. 21 వికెట్లను పడగొట్టాడీ యంగ్ డైనమిక్ బౌలర్.
జట్టు కూర్పు ఇలా:తుదిజట్టులో- క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), డేవిడ్ వార్నర్, రచిన్ రవీంద్ర, విరాట్ కోహ్లీ (కేప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కొ జెన్సెన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఆడమ్ జంపా, జస్ప్రీత్ బుమ్రాలను తీసుకుంది. 12వ ప్లేయర్గా శ్రీలంకకు చెందిన దిల్షాన్ మదుశంకను ఎంపిక చేసింది.