India semifinals: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్పై ఆస్ట్రేలియా సాధించిన నెయిల్ బైటింగ్ మ్యాచ్ తరువాత సమీకరణాలు మారిపోయాయి. ఈ విజయంతో ఆస్ట్రేలియా తన సెమీ ఫైనల్స్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఇప్పటివరకు సెమీస్ చేరిన భారత్, దక్షిణాఫ్రికా సరసన చేరింది.
నాలుగో బెర్త్ ఇంకా మిగిలేవుంది. దీనికోసం నాలుగు జట్లు పోటీలో ఉన్నాయి. న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నెదర్ల్సాండ్స్ ఈ ఒక్క స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇంటిదారి పట్టాయి. గ్రూప్ దశలోనే ఈ మూడు జట్ల కథ పరి సమాప్తం అయింది.

ఈ నాలుగింట్లో కూడా సెమీ ఫైనల్స్ చేరడానికి న్యూజిలాండ్కు అధిక అవకాశాలు ఉన్నాయి. 45 శాతం మేర ఛాన్సులు ఉన్నాయి. పాకిస్తాన్కు 40, ఆఫ్ఘనిస్తాన్కు 14, నెదర్లాండ్స్కు ఒక శాతం మేర సెమీస్ అవకాశాలు మిగిలే ఉన్నాయి. నేడు న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్తో ఇంకో క్లారిటీ వస్తుంది.
ఈ పరిస్థితుల్లో టీమిండియాను సెమీఫైనల్స్లో ఢీ కొట్టే ప్రత్యర్థి ఎవరనేది ఆసక్తి రేపుతోంది. గ్రూప్ దశలో ఎదురులేని జట్టుగా నిలిచిన రోహిత్ సేనతో తలపడటానికి సాహసించే శతృవు ఎవరనేది ఉత్కంఠతగా మారింది. ఆఫ్ఘనిస్తాన్పై ఘన విజయం సాధించి సెమీ ఫైనల్స్లో చేరిన తరువాత ఈ సమీకరణాలు మారిపోయాయి.
పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు ఖాతాలో ఇంకొక్క మ్యాచ్ మిగిలివుంది. తన చివరి లీగ్లో బంగ్లాదేశ్తో ఆడాల్సి ఉంది. 11వ తేదీన పుణేలో షెడ్యూల్ అయిందీ గేమ్. ఇందులో గెలిచినా ఆ జట్టు రెండో స్థానానికి చేరుకోలేకపోవచ్చు. దక్షిణాఫ్రికా తన తదుపరి మ్యాచ్లో ఆఫ్ఘన్తో ఆడాల్సి ఉన్నందున.. ఆ జట్టు తన పాయింట్లను పెంచుకోవడానికే అవకాశం ఉంది. ఫలితంగా ఆసీస్ రెండో స్థానానికి చేరుకోలేకపోవచ్చు.
ఐసీసీ నిబంధనల ప్రకారం- పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు తొలి సెమీ ఫైనల్స్ ఆడతాయి. చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు రెండో సెమీస్లో తలపడతాయి. దీని ప్రకారం చూసుకుంటే ప్రస్తుతానికి తొలి సెమీస్లో టీమిండియాతో తలపడే జట్టు దక్షిణాఫ్రికా.
ఈ నెల 15వ తేదీన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో తొలి సెమీ ఫైనల్స్ షెడ్యూల్ అయింది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. భారత్- దక్షిణాఫ్రికా మధ్య సెమీ ఫైనల్స్ దాదాపుగా ఖరారైనట్టే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ ఈక్వేషన్లో మార్పు ఉండకపోవచ్చు.