ఐసీసీ వరల్డ్ కప్ 2023: ప్రపంచ కప్ 2023లో ఆస్ట్రేలియా గేరు మార్చింది. టాప్ స్పీడ్తో దూసుకెళ్తోంది. మొన్నటివరకు వరుస విజయాలతో కుదల్ అయిన ఆసీస్ ఇప్పుడు రెచ్చిపోతోంది. ప్రత్యర్థి ఎలాంటి వాడైనా లెక్క చేయట్లేదు. భారీ స్కోర్లతో దుమ్ము దులుపుతోంది. రెండే రెండు విజయాలతో ఒక్కసారిగా టాప్ 4లోకి దూసుకొచ్చిందా జట్టు.
శుక్రవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్కు చుక్కలు చూపించింది ఆస్ట్రేలియా. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది. ఇద్దరే ఇద్దరు బ్యాటర్లు మ్యాచ్ మొత్తాన్నీ ఆడేశారు. పాక్ బౌలర్లను చితగ్గొట్టారు.

ఓపెనర్లు డేవిడ్ వార్నర్ ఏకంగా 163 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్లో 14 బౌండరీలు, తొమ్మిది భారీ సిక్సులు నమోదయ్యాయంటే ఏ స్థాయిలో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. మరో ఓపెనర్ మిఛెల్ మార్ష్దీ అదే తరహా సునామీ ఇన్నింగ్. 108 బంతుల్లో 10 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లతో 121 పరుగులు చేశాడు మిఛెల్.
ఆ తరువాత బ్యాటర్లెవరూ రాణించలేకపోయినప్పటికీ.. అప్పటికే పాకిస్తాన్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. స్కోర్ బోర్డుపై భారీగా పరుగులు జమ చేసింది ఆసీస్. పాకిస్తాన్ స్టార్ షహీన్ షా అఫ్రిది అయిదు వికెట్లు పడగొట్టాడు గానీ.. అతని తోటి బౌలర్ల నుంచి ఎలాంటి సహకారం అందలేదు.

ఈ భారీ టార్గెట్ను ఛేదించడంలో పాకిస్తాన్ విఫలమైంది. తొలి వికెట్ నష్టానికి 134 పరుగులు చేసినప్పటికీ.. మ్యాచ్ను మాత్రం కాపాడుకోలేకపోయింది. 45.3 ఓవర్లల్లో 305 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫిక్- 64, ఇమాముల్ హక్- 70, మహ్మద్ రిజ్వాన్- 40 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లెవరూ ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయారు. ఫలితంగా 62 పరుగులతో ఓటమి తప్పలేదు.
ఈ మ్యాచ్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తళుక్కున మెరిశారు. వారిద్దరూ చిన్నస్వామి స్టేడియం వీఐపీ లాంజ్లో కూర్చుని మ్యాచ్ చూశారు. దాదాపుగా మూడు గంటల పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ స్టేడియంలో గడిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి.