ఇస్లామాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా మరో ఆసక్తికరమైన పోరు నడుస్తోంది. ఆస్ట్రేలియాతో ఆఫ్ఘనిస్తాన్ తలపడుతోంది. ముంబైలోని వాంఖెడే స్టేడియం దీనికి వేదిక. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘన్. తొలి రెండు ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. రహ్మతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ క్రీజ్లో ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్.. ఓ సరికొత్త చరిత్రను సృష్టించింది. తనపై ఉన్న పసికూన అనే ముద్రను చెరిపేసుకుంది శాశ్వతంగా. భారత్ వేదికగా సాగుతోన్న ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో కొన్ని అనూహ్య విజయాలను అందుకుంటోన్న ఆ దేశ జట్టు- మరో ఘనతను అందుకుంది.

2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ (Champios trophy 2025)కు అర్హత సాధించింది. పాకిస్తాన్లో జరిగే టోర్నమెంట్ ఇది. ఐసీసీ ప్రపంచ కప్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ లబ్దిపొందింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడానికి అవకాశం కల్పించినట్టయింది. ఈ వరల్డ్ కప్లో ఇప్పటికే ఎనిమిది పాయింట్లను సాధించడం ఆ జట్టుకు కలిసి వచ్చింది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లల్లో మూడింట్లో నెగ్గింది ఆప్ఘన్. ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి బలమైన జట్లను మట్టికరిపించింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు ఇప్పటికే ఈ ట్రోఫీకి అర్హత సాధించాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ వాటి సరసన చేరింది. ఇంకో రెండు బెర్త్లు మిగిలే ఉన్నాయి. ఈ రెండు ఖాళీలను ఏ జట్లు దక్కించుకోగలుగుతాయనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ రెండు స్థానాల కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. నెదర్లాండ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్లు రేసులో ఉన్నాయి.