Centuries in ICC World Cup 2023: ఈ ఐసీసీ ప్రపంచ కప్ 2023లో బ్యాటర్లు దుమ్ములేపుతున్నారు. రెచ్చిపోయి ఆడుతోన్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై దయా దాక్షిణ్యాలు చూపట్లేదు. కనీస కనికరం చూపట్లేదు. స్టేడియాల్లో పరుగుల సునామీని సృష్టిస్తోన్నారు. వారి ప్రతాపానికి బౌలర్లకు దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. ఈ టోర్నమెంట్.. బౌలర్లకు పీడకలగా మారేలా ఉంది.
ఒక్కో జట్టు ఒక్కో తీరుతో చెలరేగుతోంది. టీమిండియా మొదలుకుని ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్ వరకూ టీమ్స్ అన్నీ సరికొత్త రికార్డులను బద్దలు కొడుతున్నాయి. వరల్డ్ కప్ హిస్టరీలో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటోన్నాయి.

ఇప్పటివరకు వరల్డ్ కప్ 2023లో 23 మ్యాచ్లు ముగిశాయి. ఈ మధ్యాహ్నం జరగబోయేది 24వది. ఆస్ట్రేలియా- నెదర్లాండ్స్ తలపడుతున్నాయి. డిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం దీనికి వేదిక. తనకంటే ఎన్నో రెట్లు బలమైన దక్షిణాఫ్రికాను ఓడించిన ఊపు మీద ఉంది నెదర్లాండ్స్. మరో సంచలనం నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేని మ్యాచ్ ఇది.
ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు 23 మ్యాచ్లు ముగియగా.. 19 సెంచరీలు నమోదయ్యాయి. బ్యాటర్ల ప్రతాపం ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రెండేసి చొప్పున సెంచరీలు నమోదైన ఇన్నింగ్స్ చాలానే ఉన్నాయి ఈ టోర్నమెంట్లో. గతంలో ఈ తరహా సందర్భం ఎప్పుడూ ఎదురు కాలేదనే అనుకోవచ్చు.
వంద పరుగులు చేయడం అనేది మంచినీళ్లు తాగినంత సులువుగా మారినట్టయింది బ్యాటర్లకు. అలవోకగా సెంచరీలను బాది అవతల పడేస్తోన్నారు. వారి స్ట్రైక్ రేట్ సైతం 100కు పైగానే నమోదవుతోంది. టీ20 ఫార్మట్ ప్రభావం వల్లే ఇన్నేసి సెంచరీలు నమోదవుతున్నాయనడంలో సందేహాలు అక్కర్లేదు.
అత్యధికంగా సెంచరీలను చేసిన బ్యాటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా డాషింగ్ ఓపెనర్ క్వింటన్ డికాక్ టాప్లో ఉన్నాడు. ఇప్పటివరకు మూడుసార్లు ఈ ఘనతను సాధించాడు. తొలి మ్యాచ్లో శ్రీలంకపై 100 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 109 పరుగులో చెలరేగాడు. అవి చాలవన్నట్లు- తాజాగా బంగ్లాదేశ్పైనా సునామీలా విరుచుకుపడ్డాడు. 174 పరుగుల చేశాడు.
డెవాన్ కాన్వే- 152, రచిన్ రవీంద్ర- 123, ఎయిడెన్ మార్క్రమ్- 106, డేవిడ్ మలన్- 140, కుశాల్ మెండిస్- 122, సదీర సమరవిక్రమ- 108 పరుగులు చేశారు. అబ్దుల్లా షఫిక్-113, మహ్మద్ రిజ్వాన్- 131 సెంచరీలతో కదం తొక్కారు. ఆఫ్ఘనిస్తాన్పై టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ చేసిన 131 పరుగులు మ్యాచ్కే హైలైట్.
టీమిండియా రన్నింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్పై చేసిన 103 పరుగులు.. అతని సత్తాకు అద్దం పట్టాయి. చివరి వరకూ క్రీజ్లో నిలిచాడు కింగ్ కోహ్లీ. అతన్ని అవుట్ చేయడం బంగ్లా బౌలర్ల తరం కాలేదా మ్యాచ్లో. న్యూజిలాండ్పై 95 పరుగుల వద్ద కోహ్లీ అవుట్ కావడం అభిమానులను నిరాశ పరిచింది.
ఆస్ట్రేలియా బ్యాటర్లు సైతం సెంచరీలను అందుకున్నారు. పాకిస్తాన్పై జరిగిన మ్యాచ్లో ఆసీస్ ఇన్నింగ్లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. ఓపెనర్లు డేవిడ్ వార్నర్- 163, మిఛెల్ మార్ష్- 121 పరుగులు చేశారు. ఇంగ్లాండ్పై మ్యాచ్లో క్లాస్ ప్లస్ మాస్ హెన్రిచ్ క్లాసెన్ రెచ్చిపోయాడు. 109 పరుగులతో సునామీ ఇన్నింగ్ ఆడాడు.
భారత్పై న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిఛెల్ 130 పరుగులతో వెన్నెముకగా నిలిచాడు. దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓడినప్పటికీ.. పోరాట స్ఫూర్తిని ప్రదర్శించింది. మహ్మదుల్లా సెంచరీతో సత్తా చాటాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోకుండా కాపాడగలిగాడు.