నాలుగు మ్యాచ్ల్లో ఒకటి మాత్రమే గెలిచిన లంకేయులు
నాలుగు మ్యాచ్ల్లో ఒకటి మాత్రమే గెలిచిన ఈ జట్టు 4 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. దీంతో లంకేయులు నాకౌట్ చేరాలంటే ఈ మ్యాచ్తో పాటు తర్వాతి నాలుగు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో శనివారం శ్రీలంక ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది.
జట్టు మేనేజర్ అశాంత డిమెల్ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో ఆ జట్టు మేనేజర్ అశాంత డిమెల్ మాట్లాడుతూ "మా తొలి 4 మ్యాచ్ల కోసం పచ్చికతో ఉన్న వికెట్లను ఐసీసీ సిద్ధం చేసింది. ఈ పిచ్లపై పచ్చికను తొలగించి ఇతర జట్లను ఆడించగా భారీస్కోర్లు నమోదయ్యాయి. ఓవల్ పిచ్పైనా పచ్చిక ఎక్కువగా ఉంది. ఐసీసీ మా పట్ల వివక్ష చూపిస్తుంది" అని అన్నారు.
కొన్ని జట్లకు ఒకలా మరికొన్ని జట్లకు మరోలా
"కొన్ని జట్లకు ఒకలా మరికొన్ని జట్లకు మరోలా పిచ్లను తయారు చేస్తుంది. టోర్నీ ఆడేందుకు వచ్చిన పది దేశాలను సమానంగా చూడాలి. కానీ ఏ విషయంలోనూ మమ్మల్ని అలా చూడట్లేదు. కార్డిఫ్లో ప్రాక్టీస్ వసతులూ సరిగా లేవు. కొన్ని జట్లకు మూణ్నాలుగు నెట్స్ ఇస్తే... మాకు రెండింటితో సరిపెట్టారు" అని అన్నాడు.
డబుల్ డెక్కర్ బస్సులిస్తే మాకేమో
"అందరికి సౌకర్యవంతమైన డబుల్ డెక్కర్ బస్సులిస్తే మాకేమో తక్కువ సీట్లున్న బస్సుతో లాగిస్తున్నారు. బ్రిస్టల్లో మేం బస చేసిన హోటల్లో స్విమ్మింగ్ పూల్ లేదు. ఫాస్ట్ బౌలర్లు ప్రాక్టీస్ తర్వాత సేదతీరడానికి పూల్ తప్పనిసరి. ఈ విషయాలపై ఐసీసీకి నాలుగు రోజుల క్రితమే లేఖ రాశాం. ఇప్పటివరకు సమాధానం రాలేదు" అని తెలిపాడు.
శ్రీలంక చేసిన ఆరోపణల్ని ఖండించిన ఐసీసీ
శ్రీలంక చేసిన ఆరోపణల్ని ఐసీసీ ఖండించింది. "ఐసీసీ ఈవెంట్ల కోసం ఆతిథ్య దేశం క్యురేటర్లతో కలిసి పనిచేయడానికి పిచ్ పరిజ్ఞానమున్న స్వతంత్ర సలహాదారును ఐసీసీ నియమిస్తుంది. వరల్డ్కప్ అందుకు భిన్నం ఏమీ కాదు. ప్రపంచకప్లో క్యూరేటర్లు రూపొందించిన పిచ్లపై మేం సంతృప్తిగా ఉన్నాం" అని ఐసీసీ ప్రతినిధి ఒకరు అన్నారు.