హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్కప్లో సెమీఫైనల్కు చేరే జట్లు ఏవేంటో ఇప్పటికే మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, భారత మాజీ ఓపెనర్ బ్యాట్స్మన్ గౌతం గంభీర్ మాత్రం భిన్నంగా స్పందించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మెగా టోర్నీలో తన ఫేవరెట్ జట్టు ఆస్ట్రేలియా అని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు భారీ పరుగులు చేస్తారని చెప్పిన గంభీర్, ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎక్స్ ఫ్యాక్టర్లా ఉపయోగపడతాడని అన్నాడు.
గంభీర్ మాట్లాడుతూ "సొంతగడ్డపై ఆడుతుండటం ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు కలిసొచ్చే అంశం. గతంతో పోలిస్తే ఆ జట్టు ఇంకా దృఢంగా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. ఆ జట్టులో నలుగురు ఆల్రౌండర్లు ఉండటం అదనపు బలం. ఈ టోర్నీలో నా ఫేవరెట్ జట్టు మాత్రం ఆస్ట్రేలియానే" అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
"అందుకు కారణం ఆ జట్టు ఫైనల్ చేరుకునేందుకు సరైన పక్కా ప్లాన్తో బరిలోకి దిగుతుంది. ఇక, ఫైనల్లో ఆ జట్టు ఇండియా లేదా ఇంగ్లాండ్తో తలపడొచ్చు. ఆస్ట్రేలియా కచ్చితంగా ఫైనల్కు చేరుకుంటుంది. విజేతగా నిలవాలంటే జట్టులో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆటగాళ్ల ఆత్మవిశ్వాసంపైనే విజయాలు ఆధారపడి ఉంటాయి" అని గంభీర్ అన్నాడు.
మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ఆరంభమయ్యే వన్డే వరల్డ్కప్లో టైటిల్ ఫేవరేట్ జట్లలో టీమిండియా ఒకటి. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా గత కొన్నేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తోంది. కాగా, 20 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే వరల్డ్కప్కు ఇంగ్లాండ్ వేదికగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్కప్ 12వ ఎడిషన్ కావడం విశేషం.
మే30 నుంచి జులై 14వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 46 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వడం ఇది ఐదోసారి(1975, 1979, 1983, 1999). యుకేలోని మొత్తం 11 వేదికల్లో 46 రోజుల పాటు మొత్తం 48 మ్యాచ్లు జరగనున్నాయి.