
హైదరాబాద్: ఆతిథ్య జట్టుకు లంకేయులు షాకిచ్చారు. లీడ్స్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్కు షాకిస్తూ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 233 పరుగుల చేధనలో ఇంగ్లాండ్ 47 ఓవర్లలో 212 పరుగుల వద్దకే ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (89 బంతుల్లో 82 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు) హాఫ్ సెంచరీతో నాటౌట్ నిలివగా... జో రూట్ (89 బంతుల్లో 57; 3 ఫోర్లు) రాణించాడు. శ్రీలంక బౌలర్లలో లసిత్ మలింగ (4/43) మాయ చేశాడు. స్పిన్నర్ ధనంజయ 3 వికెట్లు తీశాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
శ్రీలంక పేసర్ లసిత్ లసిత్ మలింగ రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బెయిర్స్టో (0) ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డక్గా వెనుదిరిగితే.. ఏడో ఓవర్లో జేమ్స్ విన్స్ (14) పెవిలియన్ బాటపట్టాడు. ఈ దశలో రూట్ (57), కెప్టెన్ మోర్గాన్ (21)మూడో వికెట్కు 47 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
ఈ దశలో ఉడాన అద్భుతమైన రిటర్న్ క్యాచ్తో మోర్గాన్ను పెవిలియన్కు చేర్చాడు. రూట్కు స్టోక్స్ జతకలవడంతో ఇన్నింగ్స్ జోరందుకుంది. వీరిద్దరూ ఎడాపెడా భారీ షాట్లు బాదడంతో చేధించాల్సిన లక్ష్యం తగ్గింది. నాలుగో వికెట్కు 54 పరుగులు జోడించాక రూట్ను కూడా మలింగ్ ఔట్ చేశాడు.
20 ఓవర్లలో ఇంగ్లాండ్ విజయానికి 107 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో ఓ ఎండ్లో స్టోక్స్ పోరాడుతున్నా.... క్రీజులోకి వచ్చిన వారంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరడంతో ఇంగ్లాండ్కు ఓటమి తప్పలేదు.
ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 233
అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య జట్టుకు 233 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక జట్టులో ఏంజెలో మ్యాథ్యూస్ 115 బంతుల్లో 85(5 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించగా అవిష్కా ఫెర్నాండో 39 బంతుల్లో 49(6 ఫోర్లు, 2 సిక్సులు), కుశాల్ మెండిస్ 68 బంతుల్లో 46(2ఫోర్లు) ఫరవాలేదనిపించారు.
శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు మూడు పరుగుల వద్దే ఓపెనర్లు కరుణరత్నే(1), కుశాల్ పెరీరా(2) పెవిలియన్ చేరారు. ఆవిష్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్ జోడి నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కి 59 పరుగులు జోడించిన తర్వాత ఫెర్నాండో(49; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు) ఔటయ్యాడు.
మార్క్ వుడ్ బౌలింగ్లో ఫెర్నాండో... రషీద్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండిస్-ఏంజెలా మాథ్యూస్లు ఇన్నింగ్స్ను చక్కదిద్దే యత్నం చేశారు. అయితే, జట్టు స్కోరు 133 పరుగుల వద్ద కుశాల్ మెండిస్(46; 68 బంతుల్లో 2 ఫోర్లు) నాలుగో వికెట్గా పెవిలియన్ చేరాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన జీవన్ మెండిస్ డకౌట్గా వెనుదిరిగాడు. చివర్లో ధనంజయ డిసిల్వా(29) ఫర్వాలేదనిపించాడు. దీంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ చెరో మూడు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్ రెండు, క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశారు.