
హైదరాబాద్: బర్మింగ్హామ్ వేదికగా మంగళవారం టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్రపంచకప్లో బంగ్లాదేశ్ తరఫున ఐదు వికెట్లు సాధించిన రెండో బౌలర్గా అరుదైన ఘనత సాధించాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(26), హార్దిక్ పాండ్యా(0), ధోని(30), దినేశ్ కార్తీక్(8), మహ్మద్ షమీ(1)ల వికెట్లను ముస్తాఫిజుర్ పెవిలియన్కు చేర్చాడు.
దీంతో వరల్డ్కప్లో ఐదు వికెట్లు సాధించిన రెండో బంగ్లా బౌలర్గా నిలిచాడు. ఇదే ప్రపంచకప్లో ఆప్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో షకీబ్ ఉల్ హసన్ ఐదు వికెట్లు సాధించగా... టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ముస్తాఫిజుర్ ఐదు వికెట్లతో చెలరేగాడు. కాగా, 2011 వరల్డ్కప్లో షఫిల్ ఇస్లామ్ తీసిన నాలుగు వికెట్లే ఇప్పటివరకు బంగ్లా తరుపున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన.
అయితే, ఈ ప్రపంచకప్లో షకీబ్ ఉల్ హాసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్లు బద్దలు కొట్టారు. మంగళవారం టీమిండియాతో జరిగిన మ్యాచ్లో ముస్తాఫిజుర్ పది ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీయడంతో పాటు 59 పరుగులు ఇచ్చాడు. ఇక, షకీబ్ ఉల్ హాసన్, రుబెల్ హుస్సేన్, సౌమ్య సర్కార్ తలో వికెట్ తీసుకున్నారు.
రోహిత్ శర్మ 92 బంతుల్లో 104(7 ఫోర్లు, 5 సిక్సులు) సెంచరీకి తోడు... కేఎల్ రాహుల్ 92 బంతుల్లో 77(6 ఫోర్లు, ఒక సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్కు 315 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.