
ప్రపంచకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాక్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ హాఫ్ సెంచరీ చేసాడు. చాహల్ బౌలింగ్లో భారీ సిక్సర్తో ఫకర్ జమాన్ (62; 75 బంతుల్లో 7×4, 1×6) హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 337 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభంలోనే తొలి వికెట్ను కోల్పోయింది. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (7) విజయ్ శంకర్ బౌలింగ్లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. 5వ ఓవర్లో 4 బంతులు వేసిన భువనేశ్వర్ గాయం కారణంగా వెనుదిరగగా.. మిగిలిన 2 బంతులను వేసేందుకు వచ్చిన శంకర్ తన తొలి బంతికే వికెట్ తీసాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అనంతరం క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజంతో కలిసి ఫకర్ జమాన్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను గాడిలో పెట్టాడు. ఇద్దరూ అడపాదడపా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. ఇద్దరూ క్రీజులో కుదురుకుని ప్రమాదకరంగా మారారు. అయితే నిలకడగా ఆడుతున్న బాబర్ ఆజం (48; 57 బంతుల్లో 3×4, 1×6) కుల్దీప్ వేసిన 23.6వ బంతికి క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హఫీజ్ సిక్స్ బాది ప్రమాదకరంగా కనిపించాడు.
కుల్దీప్ వేసిన 26.2వ బంతికి ఫకర్ జమాన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక పాండ్యా వేసిన 27.5వ బంతికి మొహమ్మద్ హఫీజ్ (7) శంకర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికి షోయబ్ మాలిక్ (0) డకౌట్ అయ్యాడు. దీంతో పాక్ కీలక ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం 27 ఓవర్లు ముగిసే సరికి పాక్ ఐదు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (0), ఇమాద్ వసీం (0) పరుగులతో క్రీజులో ఉన్నారు. కుల్దీప్, పాండ్యాలు చెరో రెండు వికెట్లు తీశారు.
{headtohead_cricket_3_5}