ప్రపంచకప్లో భాగంగా ఆదివారం భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. పాక్ ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే పాక్ అభిమానులు ఆ దేశ ఆటగాళ్లపై మీమ్స్, జోక్స్ పేల్చుతున్నారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్, సెలక్షన్ కమిటీని ఓ ఆటాడుకుంటున్నారు. ఓ అభిమాని ఏకంగా పాక్ జట్టును నిషేధించాలంటూ పిటిషన్ వేసాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మ్యాచ్ ఓటమికి జట్టుతో పాటు సెలక్షన్ కమిటీ కూడా బాధ్యత వహించాలని పంజాబ్ ప్రావిన్స్లోని గుజ్రన్వాలా సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పాక్ జట్టు, చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ ఉల్ హక్పై నిషేధం విధించాలని ఆ అభిమాని పిటిషన్లో పేర్కొన్నాడు. సివిల్ కోర్టు న్యాయమూర్తి ఈ పిటిషన్ను విచారించాడు. అనంతరం ఈ విషయంపై నివేదికలు అందించాల్సిందిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం పీసీబీ సమావేశం కానుంది.
మాంచెస్టర్ వేదికగా భారత్తో జరిగిన మ్యాచ్లో పాక్ 89 పరుగులతో ఓటమిని చవిచూసింది. దీంతో భారత్పై ప్రపంచకప్లో వరుసగా ఏడో ఓటమిని ఎదుర్కొంది. ఇక పాకిస్థాన్ ప్రపంచకప్లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడగా.. ఒక విజయం, మూడు ఓటములను చవిచూసింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుతం పాక్ 3 పాయింట్లతో పాయింట్ల పట్టికలో దిగువ నుండి రెండవ స్థానంలో ఉంది. సెమీస్కి చేరాలంటే పాక్ మిగిలిన నాలుగు మ్యాచ్లలో తప్పక విజయం సాదించాలి.