జడేజా సూపర్ ఇన్నింగ్స్:
కివీస్ బౌలర్ల దాటికి భారత బ్యాట్స్మన్ వరుసగా పెవిలియన్ చేరారు. రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కొద్దిసేపు పోరాడినా.. చెత్త షాట్లు ఆడి ఔట్ అయ్యారు. 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4x4, 4x6) అద్భుత బ్యాటింగ్తో ఆదుకున్నాడు. ఎంఎస్ ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1X6)తో కలిసి వందకుపైగా భాగస్వామ్యం నెలకొల్పి భారత శిబిరంలో ఆశలు రేపాడు. ఈ సమయంలో భారీ షాట్ ఆడబోయిన జడేజా.. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ చేతికి చిక్కి వెనుతిరిగాడు. అనంతరం ధోనీ రనౌట్ అవ్వడంతో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
|
గతంలో ఎప్పుడూ చూడలేదు:
గతంలో జడేజాపై విరుచుకుపడ్డ సంజయ్ మంజ్రేకర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ... 'ఈ రోజు జడేజా తన ఆటతో నన్ను ముక్కలు ముక్కలు ( బిట్స్ అండ్ పీసెస్) చేసాడు. అద్భుత బ్యాటింగ్తో తన వ్యాఖ్యలు తప్పని నిరూపించాడు. గత 40 ఇన్నింగ్స్లలో జడేజా చేసిన అత్యధిక పరుగులు 33 మాత్రమే. గతంలో ఇలాంటి జడేజాను ఎప్పుడూ చూడలేదు. బౌలింగ్, బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ ఆకట్టుకున్నాడు' అని మంజ్రేకర్ అన్నాడు.
జడేజా కౌంటర్:
ఇంతకుముందు .. 'రవీంద్ర జడేజా లాంటి బిట్స్ అండ్ పీసెస్ ఆటగాళ్లకు ఫ్యాన్ కాను. జడేజా కేవలం టెస్టు క్రికెటర్ మాత్రమే.. పరిమిత ఓవర్ల క్రికెట్కు అతడు అన్ఫిట్' అని మంజ్రేకర్ అన్నాడు. అంతేకాకుండా జడేజాను అల్రౌండర్గా పరిగణించబోనని పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన జడేజా ట్విట్టర్ వేదికగా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. 'ఇప్పటికే నువ్వు ఆడిన మ్యాచ్ల కంటే రెండు రెట్లు ఎక్కువ మ్యాచ్లే ఆడాను. ఇంకా ఆడుతూనే ఉన్నాను. ముందుగా నువ్వు ఎవరిని ఎలా గౌరవించాలో నేర్చుకో. ఏదైనా సాధించిన వారిని గుర్తించి గౌరవించు. ఇక నీ చెత్త వాగుడు విన్నది చాలు' అంటూ సంజయ్ మంజ్రేకర్ పేరును ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు.