క్రెడిట్ అంతా బౌలర్లదే:
మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'మొదటి ఇన్నింగ్స్ బాగా ఆడాం. బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింట్లో రాణించాం. న్యూజిలాండ్ను భారీ పరుగులు చేయకుండా కట్టడి చేశాం. కివీస్ నిర్దేశించింది లక్ష్యం ఛేదించదగిందే. ఇనింగ్స్ మొదటి అరగంట కివీస్ బౌలర్లు అత్యుత్తమ ఆట ఆడాడు. కొత్త బంతితో అద్భుతంగా రాణించారు. మేము త్వరగా వికెట్లు కోల్పోయాం. న్యూజిలాండ్ బౌలర్లు మాపై మొదట్నుంచీ ఒత్తిడి తెచ్చి ఫలితం సాధించారు. ఈ మ్యాచ్ విజయం క్రెడిట్ అంతా బౌలర్లదే' అని కోహ్లీ అన్నారు.
|
45 నిమిషాల చెత్త ఆటే:
'ఈ ప్రపంచకప్లో మా ప్రదర్శన బాగానే ఉంది. సెమీస్ సమరంలో అంచనాలు అందుకోలేకపోయాం. టోర్నీ అంతా ఆకట్టుకున్నా.. కేవలం 45 నిమిషాల చెత్త ఆట టోర్నీ నిష్క్రమణకు కారణం అయింది. టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడం చాలా బాధ కలిగిస్తోంది. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.
|
జడేజా అద్భుతం:
'రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు ఆడిన తీరు అసాధారణం. జడేజా నాణ్యమైన క్రికెటర్ అనడానికి ఈ ఇన్నింగ్స్ చాలు. ఇప్పటికే జడేజా చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడినా.. తాజా ఇన్నింగ్స్ అతనికి ఆటను మరింత బయటకు తీసుకొచ్చింది. జడేజాతో కలిసి ధోనీ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖర్లో ధోనీ రనౌట్ అవడం విజయాన్ని దూరం చేసింది. మాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్క అభిమానికి థాంక్య్' అని కోహ్లీ పేర్కొన్నాడు.
ఫైనల్లో న్యూజిలాండ్:
సెమీఫైనల్లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో భారత్పై గెలిచింది. మొదట న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. టేలర్ (90 బంతుల్లో 74; 3 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ (95 బంతుల్లో 67; 5 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. 92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా.. రవీంద్ర జడేజా (59 బంతుల్లో 77; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఎంఎస్ ధోనీ (72 బంతుల్లో 50; 1 ఫోర్, 1 సిక్స్)లు పోరాడారు. న్యూజిలాండ్ బౌలర్లలో హెన్రీ (3/37), బౌల్ట్ (2/42) రాణించారు.