10 మ్యాచ్లలో 17 వికెట్లు:
ఈ ప్రపంచకప్ టోర్నీలో టీమిండియా తరపున బుమ్రా తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. 17 వికెట్లు పడగొట్టి టాప్-5 వికెట్ టేకర్లలో ఒకడిగా నిలిచాడు. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో బుమ్రా తన బౌలింగ్ మార్క్ చూపాడు. కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ను కేవలం ఒక్క పరుగు వద్దే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేసాడు. 8 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 25 పరుగులే ఇచ్చి 1వికెట్ తీసాడు.
9 మెయిడెన్ ఓవర్లు:
భువనేశ్వర్ మొదటి ఓవర్ మెయిడిన్ వేయగా.. యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా రెండో ఓవర్ మెయిడిన్ వేసాడు. దీంతో ఈ ప్రపంచకప్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్గా బుమ్రా రికార్డు సాధించాడు. ఇప్పటివరకు బుమ్రా 10 మ్యాచులాడి 9 మెయిడెన్ ఓవర్లు వేశాడు. బుమ్రా తర్వాత ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 8 మెయిడెన్ ఓవర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. జూలై 11న బర్మింగ్హామ్ వేదికగా రెండో సెమీస్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ తలపడనున్న నేపథ్యంలో బుమ్రాను అధిగమించే అవకాశం ఆర్చర్కు ఉంది.
|
బుమ్రాను అనుకరించిన కోహ్లీ:
అయితే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. జస్ప్రీత్ బుమ్రా ప్రత్యేకమైన బౌలింగ్ శైలిని, అతని వికెట్ వేడుకను అనుకరించాడు. సెమీ ఫైనల్ మ్యాచ్ ముందు ప్రాక్టీస్ సందర్భంగా కోహ్లీ ఇలా చేసాడు. ఇది చూసిన భారత ఆటగాళ్లు నవ్వులు పూయించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.
రిజర్వ్డేకు వాయిదా:
ఇక ప్రపంచకప్లో భాగంగా మంగళవారం భారత్, న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించడంతో రిజర్వ్డే (బుధవారం)కు వాయిదా పడింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మరో నాలుగు ఓవర్లలో ముగుస్తుందనుకున్న సమయంలో చిరుజల్లులతో మొదలైన వర్షం అనంతరం భారీగా పడడంతో మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఇక పలు మార్లు వర్షం వచ్చి వెళుతుండడంతో అంపైర్లు మ్యాచ్ను బుధవారంకు వాయిదా వేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్ (67), లాథమ్ (3)లు ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు న్యూజిలాండ్ బ్యాటింగ్తో మ్యాచ్ మొదలవుతుంది.