
యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కి బదులు సీనియర్ బ్యాట్స్మన్ అజింక్య రహానేను సెలెక్టర్లు ఎంపిక చెయ్యాల్సిందని భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్సర్కార్ అభిప్రాయపడ్డారు. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్కు గాయం అవడంతో పంత్ను ఇంగ్లాండ్ కు రప్పించారు భారత సెలెక్టర్లు. పంత్ వచ్చినా.. టీమిండియా ప్రస్తుతం 14 మంది ఆటగాళ్లతోనే ప్రపంచకప్లో ఆడుతోంది. మరోవైపు ధావన్ ప్రస్తుతం గాయం నుండి కోలుకుంటున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ నేపథ్యంలో దిలీప్ వెంగ్సర్కార్ మాట్లాడుతూ... '1983 ప్రపంచకప్ లీగ్ స్టేజ్లో బాగా ఆడుతున్నప్పుడు నేను గాయపడ్డాను. గాయం నుండి కోలుకునేసరికి భారత్ జట్టు సెమీస్కి చేరింది. అప్పటికే వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియా ఫైనల్స్లోనూ అదే జట్టుని కొనసాగించింది. కోలుకున్నా కూడా నాకు అవకాశమే రాలేదు. గాయం నుంచి కోలుకున్న ఆటగాడు తిరిగి జట్టులో చేరినప్పుడు మునుపటి ఫామ్ను కొనసాగించడం కష్టం. ధావన్ విషయానికొస్తే ఎంత త్వరగా కోలుకుంటాడో చెప్పలేను' అని వెంగ్సర్కార్ పేర్కొన్నారు.
'మిడిలార్డర్లో సరైన బ్యాట్స్మన్ లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. నాలుగో నంబర్లో విజయ్ శంకర్ బంతితో ఆకట్టుకున్నా.. బ్యాటింగ్లో ఇంకా మెరుగుపడాల్సిన అవసరముంది. గాయపడిన ధావన్ స్థానంలో సెలెక్టర్లు రిషబ్ పంత్కి బదులు అజింక్య రహానేను ఎంపిక చెయ్యాల్సింది' అని వెంగ్సర్కర్ అభిప్రాయపడ్డారు.
టీమిండియా తన తదుపరి మ్యాచును అఫ్గాన్ జట్టుతో శనివారం ఆడనుంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 7 పాయింట్లు ఉన్నాయి. ఆడిన నాలుగు మ్యాచులలో మూడు విజయాలు సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అఫ్గాన్ మ్యాచ్ అనంతరం వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచులలో భారత్ విజయం సాధిస్తే సెమిస్ చేరుకుంటుంది.