పంత్ విషయంలో అసహనం:
బంగ్లాతో మ్యాచ్లో భారత్ ఫీల్డింగ్ చేస్తుండగా.. పంత్ మైదానంలో అంత చురుకుగా కనిపించలేదు. కొన్ని పరుగులను ఆడుకున్నా.. వేగంగా కదలలేకపోయాడు. మరోవైపు కార్తీక్ కీలక రెండు క్యాచులు పట్టడంతో పాటు మెరుపు ఫీల్డింగ్ కూడా చేసాడు. ఇది గమనించిన ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ రిషబ్ పంత్ విషయంలో అసహనం వ్యక్తం చేశాడు. బంగ్లాతో మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీధర్ మాట్లాడారు.
పంత్ మరింత శ్రమించాలి:
'పంత్ బ్యాటింగ్ బాగానే ఉంది. కానీ అతడి ఫీల్డింగ్లో మాత్రం కొన్ని లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా అతడు మైదానంలో అంత చురుగ్గా కదల్లేకపోయాడు. ఫీల్డింగ్లో పంత్ మరింత శ్రమించాల్సి ఉంది. ఔట్ఫీల్డ్లో వేగంగా కదలడం, బంతిని త్రో చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎంస్ ధోనీలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు' అని శ్రీధర్ తెలిపారు.
కార్తికే బెటర్:
'ఇంగ్లండ్తో మ్యాచ్లో పంత్ 5 పరుగుల వరకు సేవ్ చేశాడు. ఒక క్యాచ్ కూడా అందుకున్నాడు. అయితే అంచనాలకు తగ్గట్టుగా అతను ఫీల్డింగ్లో మెళకువలు నేర్చుకోవాలి. బంగ్లాతో మ్యాచ్లో దినేష్ కార్తీక్.. పంత్ కంటే బెటర్గా ఫీల్డింగ్ చేసాడు. మైదానంలో వేగంగా కదులుతూ.. తనవైపు వచ్చిన బంతులను అడ్డుకున్నాడు. అతడు బంతిని త్రో చేసే విధానం బాగుంది. మైదానాలన్నీ ఒకే రీతిలో ఉండవు, టెక్నిక్తో ఫీల్డింగ్ చేసినప్పుడే అంచనాలు అందుకోగలం' అని శ్రీధర్ చెప్పుకొచ్చారు.
ఉత్కంఠ విజయం:
మంగళవారం బంగ్లాతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో టీమిండియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ (104) రికార్డు సెంచరీ చేయగా.. కేఎల్ రాహుల్ (77) రాణించడంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఛేదనలో బంగ్లా 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. షకీబ్ (66), సైఫుద్దీన్ (51 నాటౌట్) పోరాటం వృథా అయ్యింది. బుమ్రా 4, హార్దిక్ 3 వికెట్లు తీశారు. సెంచరీ చేసిన రోహిత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు.