మహిళతో అసభ్య ప్రవర్తన చేసినందుకు అఫ్గానిస్తాన్ పేసర్ అఫ్తాబ్ ఆలమ్పై ఏడాది (12 నెలలు) పాటు నిషేధం పడింది. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు, దేశవాళీ టోర్నీల నుండి ఆలమ్ను అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) సస్పెండ్ చేసింది. అంతేకాదు ఈ సంవత్సరం పాటు అతని కాంట్రాక్టును కూడా రద్దు చేసింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ప్రపంచకప్లో భాగంగా జూన్ 22న సౌతాంప్టన్లో భారత్, అఫ్గానిస్తాన్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో అఫ్గానిస్తాన్ చివరి వరకూ పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ అనంతరం సౌతాంప్టన్ హోటల్లో ఒక మహిళతో అఫ్తాబ్ ఆలమ్ తప్పుగా ప్రవర్తించాడు. దీంతో జూన్ 23న ఐసీసీ అవినీతి నిరోధక సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాల్సి ఉండగా... అతను ఆ సమావేశానికి హాజరుకాలేదు.
దీంతో అఫ్గానిస్తాన్ కోచ్ ఫిల్ సిమన్స్ తర్వాతి రెండు మ్యాచ్ల నుంచి అఫ్తాబ్ను తప్పించినట్లు తెలిపాడు. విషయం చెప్పకుండా.. తప్పనిసరి పరిస్థితుల్లో అఫ్తాబ్ ప్రపంచకప్నకు దూరమవుతున్నాడని ప్రకటించాడు. అనంతరం ఈ ఘటనపై అఫ్గాన్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణా కమిటీ విచారించి క్రమశిక్షణా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కారణంగా అఫ్తాబ్పై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో అఫ్తాబ్ ఆలమ్పై ఏడాది పాటు ఆటకు దూరమయ్యాడు.
జూన్ 22న సౌతాంప్టన్లో భారత్తో ఆడిన మ్యాచే అఫ్తాబ్ ఆలమ్కు చివరిది. ప్రపంచకప్లో ఆలమ్ మూడు వికెట్లు పడగొట్టాడు. భారత్తో ఆడిన మ్యాచ్లో ఆలమ్ ఒక వికెట్ తీసాడు. 7 ఓవర్లు బౌలింగ్ చేసి 54 పరుగులు ఇచ్చాడు. భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (7)ను ఔట్ చేసాడు. ఈ మ్యాచ్లో భారత్ 11 పరుగులతో గెలిచింది.