సన్రైజర్స్ విజయాలు కేవలం రెండు మ్యాచులకే పరిమితం అయ్యాయి. ఐపీఎల్ 2023లో తొలి రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన ఈ జట్టు ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. దీంతో తమ టీం విజయాల బాట పట్టిందని ఫ్యాన్స్ సంతోషించారు. కానీ తమ జట్టు కెప్టెన్లు మారినా, ఆటగాళ్లు మారినా తలరాత మారదని సన్రైజర్స్ మళ్లీ నిరూపిస్తోంది.
వరుసగా రెండు విజయాల తర్వాత మరో రెండు మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కూడా చిత్తుగా ఓడింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ కేవలం 134 పరుగులు మాత్రమే చేసింది. ఈ లక్ష్యాన్ని చెన్నై మరో 8 బంతులు మిగిలుండగానే ఏడు వికెట్ల తేడాతో ఛేదించింది. ఇది సన్రైజర్స్కు వరుసగా రెండో ఓటమి.

ఈ ఓటమి తర్వాత మాట్లాడిన ఎయిడెన్ మార్క్రమ్ ఇలా ఓడిపోవడం తమకు కూడా ఇష్టం ఉండదనన్నాడు. 'ఇలా ఓడిపోవడం ఎప్పుడూ డిసప్పాయింటింగ్గానే ఉంటుంది. బ్యాటింగ్ విభాగంలో తాము బాగా విఫలం అయ్యాం. సరైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో ఫెయిలయ్యాం. ఇది 130 రన్స్ వికెట్ కాదు. ఇక్కడ ఈజీగా 160 రన్స్ చేసే పిచ్ ఇది' అని మార్క్రమ్ అన్నాడు.
కానీ సరైన భాగస్వామ్యాలు లేకపోవడంతో మొమెంటం బాగా మిస్ అయ్యామని చెప్పాడు. 'మిడిల్ ఓవర్లలో చెన్నై చాలా బాగా బౌలింగ్ చేసింది. మాకు ఎక్కువ పరుగులు చేసే అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ స్పిన్నర్లు చాలా కీలకం అని మాక్కూడా తెలుసు. కానీ వాళ్లను ఎలా ఎదుర్కోవాలని ప్రతి బ్యాటర్ తనకు తానే ప్లాన్ వేసుకోవాల్సింది. మా వాళ్లు కూడా అలాగే చేశారు. కానీ ఆ ప్లాన్లు ఏవీ సరిగా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు' అని వెల్లడించాడు.
ప్రస్తుతం తమ జట్టుకు ఐపీఎల్లో కొన్ని విజయాలు అవసరం అని, ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో ఎలా మెరుగవ్వాలో ఆలోచించుకోవాలి అన్నాడు. 'ఈ మ్యాచ్ను ఇంత చివరి వరకు తీసుకెళ్లినందుకు బౌలర్లను కచ్చితంగా మెచ్చుకోవాలి. కనీసం ఒకరిద్దరు అయినా ముందుకొచ్చి సరిగ్గా ఆడాలి. వచ్చే మ్యాచులో అయినా ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయని అనుకుంటున్నా' అని మార్క్రమ్ పేర్కొన్నాడు.