చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్రైజర్స్ చాలా చిత్తుగా ఓడింది. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ చాలా పేలవంగా బ్యాటింగ్ చేసింది. అభిషేక్ శర్మ మినహా ఒక్క బ్యాటర్ కూడా పెద్దగా రాణించలేదు. దీంతో ఆ జట్టు కేవలం 134 పరుగులే చేయగలిగింది. ఈ చిన్న లక్ష్యాన్ని చెన్నై ఈజీగా ఛేజ్ చేసేస్తుందని అంతా అనుకున్నారు.
కానీ అనవసరమైన నిర్ణయాలతో ఈ ఛేజ్ను చెన్నై చాలా కాంప్లికేట్ చేసింది. అసలు డెవాన్ కాన్వే (77 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్ (35) ఇద్దరే ఈ లక్ష్యాన్ని ఛేజ్ చేసేస్తారని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే దురదృష్టం కొద్దీ గైక్వాడ్ రనౌట్ అయ్యాడు. అప్పుడు మంచి ఫామ్లో ఉన్న శివమ్ దూబే బ్యాటింగ్కు వస్తాడని అంతా అనుకున్నారు. కానీ చెన్నై టీం మేనేజ్మెంట్ వేరే ఆలోచన చేసింది.

దూబేను కాదని అంబటి రాయుడు (9)ను పంపించింది. రాయుడు పెద్దగా రాణించలేదు. కేవలం 9 పరుగులే చేసి మయాంక్ మార్కండే బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మొయీన్ అలీ (6 నాటౌట్) కూడా నిదానంగా ఆడాడు. అయితే అతనికి పెద్దగా అవకాశం ఇవ్వని డెవాన్ కాన్వే.. తానే ఛేజ్ను ముగించాలని గట్టిగా డిసైడ్ అయినట్లే కనిపించాడు.
ఈ క్రమంలోనే వాషింగ్టన్ సుందర్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతికి బౌండరీ బాది చెన్నైను విజయతీరాలకు చేర్చాడు. ఇది చూసిన కొందరు నిపుణులు.. ఫామ్లో ఉన్న శివమ్ దూబేను పంపించేసి ఉంటే మ్యాచ్ ఎప్పుడో అయిపోయేదని అంటున్నారు. అతన్ని కాదని రాయుడు, మొయీన్ అలీని పంపడంతో నెట్ రన్ రేట్ పెంచుకునే అవకాశాన్ని చెన్నై కోల్పోయిందని ఫ్యాన్స్ కూడా అంటున్నారు.
ఈ మ్యాచ్లో డెవాన్ కాన్వే ఒక్కడే ఒంటి చేత్తో చెన్నైకి విజయం అందించాడని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవర్ప్లే తర్వాత పిచ్ నుంచి బౌలర్లకు సహకారం అందుతున్నా కూడా కాన్వే చూడచక్కని షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే వరుసగా రెండో మ్యాచులో కూడా హాఫ్ సెంచరీతో చెలరేగి, చెన్నైకి మరో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ స్పిన్నర్ మయాంక్ మార్కండే మాత్రమే రెండు వికెట్లతో రాణించాడు. మిగతా బౌలర్లంతా దారుణంగా ఫెయిలయ్యారు.