చెన్నైపై రాజస్థాన్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ సందీప్ శర్మ. క్రీజులో రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ ఉండగా.. చివరి ఓవర్ వేయడానికి వచ్చిన అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ తొలి రెండు బంతులకు రెండు వైడ్లు వేసిన అతను.. ఆ తర్వాత వరుసగా రెండు భారీ సిక్సర్లు ఇచ్చాడు. సందీప్ వేసిన బంతులను ధోనీ భారీ షాట్లతో స్టాండ్లోకి పంపాడు.
ఇది చూసిన అభిమానులు అందరూ ఇక మ్యాచ్ ముగిసినట్లేనని, చెన్నై సునాయాసంగా గెలుస్తుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాతి మూడు బంతుల్లో సందీప్ అద్భుతంగా పుంజుకున్నాడు. నాలుగో బంతిని ఆఫ్స్టంప్కు ఆవలగా ఫుల్ లెంగ్త్లో వేశాడు. దాన్ని కూడా స్టాండ్స్లోకి పంపేందుకు ధోనీ ప్రయత్నించినా కుదర్లేదు. డీప్ మిడ్ వికెట్లోని ఫీల్డర్ వరకూ వెళ్లిందంతే. దీంతో ఆ బంతికి కేవలం సింగిల్ మాత్రమే వచ్చింది.

ఈ క్రమంలో సందీప్ను ఎదుర్కొనే బాధ్యత జడేజాపై పడింది. జడ్డూను తన పిన్పాయింట్ యార్కర్తో సందీప్ ఇబ్బంది పెట్టాడు. దాన్ని భారీ షాట్ ఆడలేకపోయిన జడేజా.. సింగిల్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ వెంటనే చివరి బంతికి ధోనీ మళ్లీ స్ట్రైకింగ్కు వచ్చాడు. సిక్సర్ కొడితే చెన్నె గెలుస్తుంది. ఫోర్ బాదితే మ్యాచ్ డ్రా అవుతుంది. అలాంటి సమయంలో సందీప్ మరోసారి తన సత్తా చూపించాడు. అత్యంత యాక్యురేట్గా యార్కర్ విసిరాడు. దీన్ని భారీ షాట్ ఆడటంలో ధోనీ విఫలమయ్యాడు.
చివరి బంతికి కేవలం సింగిలే వచ్చింది. దీంతో మూడు పరుగుల తేడాతో రాజస్థాన్ ఈ మ్యాచ్లో గెలిచింది. ఇదంతా చూసిన అభిమానులు సందీప్ శర్మను వేలంలో ఎవరూ కొనకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో అద్భుతమైన బౌలర్లలో సందీప్ శర్మ ఒకడు. మంచి స్వింగ్తో బౌలింగ్ చేసే అతను ఒకానొక సమయంలో టీమిండియాకు ఆడతాడని అంతా అనుకున్నారు. జింబాబ్వేతో రెండు టీ20ల్లో మాత్రమే అతనికి అవకాశం దొరికింది. ఆ తర్వాత మళ్లీ టీమిండియా నుంచి పిలుపు రాలేదు.

గతేడాది జరిగిన మినీ వేలంలో బేస్ ధర రూ.50 లక్షలతో బరిలో దిగిన సందీప్ శర్మకు అదృష్టం కలిసి రాలేదు. ఒక్క ఫ్రాంచైజీ కూడా అతనిపై ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో చివర్లో రాజస్థాన్ రాయల్స్ అతన్ని బేస్ ధరకే కొనుగోలు చేసింది. అయితే ఈ 29 ఏళ్ల పేసర్కు ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు అవకాశం దక్కగానే తను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ఫ్యాన్స్ కూడా సందీప్ పట్టుదలకు ఫిదా అయిపోతున్నారు.