చెన్నై సూపర్ కింగ్స్ను సొంత మైదానంలో ఓడించడం అంటే మాటలు కాదు. అలాంటిది రాజస్థాన్ రాయల్స్ అలాంటి అద్భుతాన్నే చేసి చూపించింది. చెపాక్ వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో చివరకు క్రీజులో ధోనీ, రైనా ఉన్నా కూడా చెన్నైకి ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ అనుకున్నంత భారీ స్కోరు చేయలేకపోయింది. మంచి ఫామ్లో ఉన్న యశస్వి జైస్వాల్ (10) వికెట్ను ఆరంభంలోనే కోల్పోయింది.
అలాంటి పరిస్థితిలో దేవదత్ పడిక్కల్ (38), అశ్విన్ (30) అండగా జోస్ బట్లర్ (52) చూడచక్కని షాట్లతో అలరించాడు. చివర్లో హెట్మెయర్ (30) కూడా ఫర్వాలేదనిపించాడు. దీంతో చెన్నై ముందు 176 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ నిలిపింది. సొంత మైదానంలో చెన్నై ముందు ఈ లక్ష్యం ఏమాత్రం సరిపోదని అంతా అనుకున్నారు. అయితే ఎలాగైనా ఈ మ్యాచ్ గెలవాలని పట్టుదలగా ఆడిన రాజస్థాన్ చివరకు సాధించింది.

క్రీజులో ధోనీ (32 నాటౌట్), రవీంద్ర జడేజా (25 నాటౌట్) ఉన్నా కూడా తమ జట్టుకు విజయం అందించలేకపోయారు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రాజస్థాన్ సారధి సంజూ శాంసన్.. ఈ విజయం క్రెడిట్ అంతా జట్టు పోరాడిన విధానానికే అని చెప్పాడు. 'మైదానంలో భారీగా మంచు ఉన్నా కూడా మా కుర్రాళ్లు అద్భుతంగా పోరాడారు. ప్రతి ఒక్కరూ ఆటలో ప్రాణం పెట్టారు. అందరూ గెలవాలనే తపనతో ఆడారు. ఇక్కడి నుంచి సంతోషకరమైన జ్ఞాపకాలతో తిరిగి వెళ్లాలని అనుకున్నాం' అని శాంసన్ చెప్పాడు.
'మేం బౌలింగ్ వేసేప్పుడు పిచ్పై బంతి కొంచెం పట్టేస్తోంది. అందుకే జంపాను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నాం. మ్యాచ్ను త్వరగా ముగించాలని ప్రయత్నించాం. కానీ చివరి ఓవర్ వరకూ వెళ్లింది. క్రీజులో ధోనీ ఉండగా గెలుస్తామని మాత్రం అనుకోలేదు. అతన్ని అవుట్ చేయడం ఎలా? అని రకరకాల ప్లాన్లు వేసుకున్నా. చాలా రీసెర్చ్ చేశా. కానీ ఏం చేసినా ధోనీ ముందు అవేం పని చేయలేదు' అని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి చెపాక్లో చెన్నైని ఓడించడం రాజస్థాన్కు ఇదే తొలిసారి కావడం గమనార్హం.