చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టీంలో కుర్రాళ్లు చెలరేగారు. సీనియర్లు, స్టార్లు పరుగులు చేయడానికి కష్టపడిన పిచ్పై తాము మాత్రం జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంజూ నిర్ణయానికి న్యాయం చేశారు. ఆరంభంలో జట్టుకు యశస్వి జైస్వాల్ (77) అదిరిపోయే ఆరంభం అందించాడు.
అవతలి పక్క జోస్ బట్లర్ (27) కొంత తడబడుతున్నా అతను మాత్రం చెలరేగారు. ఎడాపెడా బౌండరీలతో చెన్నై బౌలర్లకు తలనొప్పులు తెప్పించాడు. అయితే బట్లర్, సంజూ శాంసన్ (17) ఇద్దరూ స్వల్ప వ్యవధిలోనే అవుటవడంతో అతనిపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో తుషార్ దేశ్పాండే వేసిన ఓవర్లో భారీ షాట్ ఆడబోయి రహానే అందుకున్న చక్కని క్యాచ్కు పెవిలియన్ చేరాడు.

జైస్వాల్ అవుటయ్యే సమయానికి రాజస్థాన్ స్కోరు 132 పరుగులే. దీంతో ఆ జట్టు భారీ స్కోరు చేయడం కష్టంగా అనిపించింది. హెట్మెయర్ (8) కూడా తక్కువ స్కోరుకే అవుట్ అవడంతో ఇక ఆ అంచనాలే పోయాయి. ఇలాంటి సమయంలో వచ్చిన ధృవ్ జురెల్ కేవలం 15 బంతుల్లోనే 34 పరుగులతో చెలరేగాడు. అతనికి దేవదత్ పడిక్కల్ కూడా మంచి సహకారం అందించాడు. అతను 13 బంతుల్లోనే 27 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఆరంభంలో జైస్వాల్ సూపర్ ఇన్నింగ్స్కు చివర్లో పడిక్కల్, జురెల్ మెరుపులు తోడవడంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. జైపూర్లో ఇప్పటి వరకు ఒక్క టీం కూడా 200 స్కోరు చేయలేదు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి టీంగా కూడా రాజస్థాన్ రాయల్స్ రికార్డు సృష్టించింది. చెన్నై బౌలర్లలో తుషార్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. తీక్షణ, జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.