రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ 202 పరుగుల భారీ స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (77), జోస్ బట్లర్ (27) ఆ జట్టుకు మంచి ఆరంభం అందించారు.చివర్లో ధృవ్ జురెల్ (34), దేవదత్ పడిక్కల్ (27 నాటౌట్) కూడా అదరగొట్టారు. దీంతో రాజస్థాన్ భారీ స్కోరు చేసింది.
లక్ష్య ఛేదనలో చెన్నైకు అనుకున్న ఆరంభం దక్కలేదు. ఫామ్లో ఉన్న డెవాన్ కాన్వే (8) విఫలమయ్యాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ (47) ఆకట్టుకున్నాడు. కానీ అతనికి సహకారం అందించే వాళ్లు కరువయ్యారు. అజింక్య రహానే (12), అంబటి రాయుడు (0) దారుణంగా విఫలమయ్యారు. మధ్యలో శివమ్ దూబే (52) చివరి వరకు పోరాడాడు. మొయీన్ అలీ (23), రవీంద్ర జడేజా (23 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించారు.

అయినా చెన్నై ఓటమిని తప్పించుకోలేదు. ఈ ఓటమిపై స్పందించిన ధోనీ.. రాజస్థాన్ జట్టు తాము అనుకున్న దాని కన్నా చాలా ఎక్కువ స్కోరు చేసిందని అన్నాడు. తొలి పవర్ప్లేలో తాము భారీగా పరుగులు ఇచ్చేశామని చెప్పాడు. 'ఆ టైంలో పిచ్ బ్యాటింగ్కు చాలా బాగుంది. మా బౌలర్లు మిడిల్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేశారు. కానీ చివర్లో చాలా ఎడ్జ్లు కూడా బౌండరీలకు వెళ్లాయి. కనీసం 5-6 బౌండరీలు అలా వెళ్లినవే' అని చెప్పాడు.
'ఊహించిన దాని కన్నా రాజస్థాన్ ఎక్కువ పరుగులు చేసింది. పతిరాణా చక్కగా బౌలింగ్ చేశాడు. ఈ స్కోర్ కార్డు చూసి వాళ్లు సరిగా బౌలింగ్ చేయలేదు అనడం కరెక్ట్ కాదు. కానీ వాళ్లకు అద్భుతమైన ఆరంభం దక్కింది. మాకు దక్కలేదు. యశస్వి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బౌలర్లపై ఎదురు దాడి చేయడమే కరెక్ట్. అతను అదే పని చేశాడు' అని వివరించాడు.
'మేం కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడమే కరెక్ట్. అదే అతను చేశాడు. గుడ్ లెంగ్త్ ఏదో అంచనా వేసి బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అలా వేసే క్రమంలో కొన్ని బౌండరీలు వెళ్లాయి. దీంతో మళ్లీ తడబడ్డాం. చివర్లో జురెల్ అద్భుతంగా ఆడాడు. అతను బాదిన మొదటి సిక్సే ఈ మ్యాచ్ను మా చేతుల్లో నుంచి లాగేసుకుంది' అని చెప్పుకొచ్చాడు.
ఇక జైపూర్ తనకు చాలా స్పెషల్ వేదిక అని చెప్పాడు. వైజాగ్లో తను చేసిన మొదటి సెంచరీతో ఒక పది మ్యాచుల్లో అవకాశాలు వచ్చాయని చెప్పిన అతను.. జైపూర్లో చేసిన 183 పరుగులు తనకు ఒక ఏడాదిపాటు అవకాశాలు వచ్చేలా చేశాయన్నాడు. ఐపీఎల్ కోసం అన్ని చోట్లకు వెళ్తున్నా కూడా.. మళ్లీ ఇక్కడకు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు.