రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ చిన్న పొరపాటు చేశాడు. యశస్వి జైస్వాల్ (77) భారీ షాట్లతో విరుచుకుపడుతున్న సమయంలో అతనికి అడ్డుకట్ట వేసేందుకు స్పిన్నర్లను రంగంలోకి దింపాడు. ఈ క్రమంలోనే మహీష్ తీక్షణ బౌలింగ్కు వచ్చాడు. అతను వేసిన తొలి ఓవర్లో సడెన్గా బౌలింగ్ మారడంతో జైస్వాల్ తడబడ్డాడు.
తీక్షణ స్పిన్ మంత్రాన్ని ఎదుర్కోవడానికి స్వీప్ షాట్ ఆడబోయాడు. అయితే తీక్షణ వేసిన బంతిని మిస్ అయ్యాడు. అది అతని ప్యాడ్లను తాకింది. దీంతో తీక్షణ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశాడు. ధోనీ కూడా అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ మాత్రం స్పందించలేదు. చూస్తున్న ప్రేక్షకులకు కూడా అది అవుటనే భావన కలిగింది. అంతలోనే ధోనీ రివ్యూ కోరాడు.

ధోనీ సాధారణంగా చిన్న చిన్న అప్పీల్స్కు రివ్యూ కోరడు. అతను రివ్యూ కోరితే కచ్చితంగా అంపైర్ నిర్ణయం మారాల్సిందే అని చాలా మంది ఫ్యాన్స్ అంటుంటారు. అందుకే డీఆర్ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టం)ను ధోనీ రివ్యూ సిస్టం అంటూ జోకులు వేస్తుంటారు. అలాంటి ధోనీ మరో ఆలోచన లేకుండా రివ్యూ కోరడంతో జైస్వాల్ అవుట్ అయిపోయాడని అంతా అనుకున్నారు.
రివ్యూలో తీక్షణ వేసిన బంతి.. జైస్వాల్ బ్యాటును ఏమాత్రం తాకలేదని కనిపించింది. దీంతో అతను అవుట్ అని అంతా నమ్మారు. అయితే బంతి పిచ్ పడటమే లెగ్ స్టంప్ ఆవల పడింది. డీఆర్ఎస్ నిబంధనల ప్రకారం పిచ్ కనుక లెగ్ స్టంప్ అవతల పడితే అది నాటౌట్. ఆ తర్వాత బాల్ ట్రాకింగ్ కూడా చూడాల్సిన అవసరం లేదు. దీంతో జైస్వాల్ బతికిపోయాడు. ఆ దేవుడికి దణ్ణం పెట్టుకొని మళ్లీ క్రీజులోకి వచ్చాడు.
ఇది చూసిన ఫ్యాన్స్ మీమ్స్ పేలుస్తున్నారు. 'డీఆర్ఎస్ అంటేనే ధోనీ రివ్యూ సిస్టం అన్నారు కదరా.. లెగ్ స్టంప్ ఆవల పిచ్ పడటాన్ని కూడా చూడలేదా?' అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ధోనీ రివ్యూ సిస్టం అనే పదం ట్విట్టర్లో తెగ వైరల్ అవుతోంది. ఏదో ఒకసారి పొరపాటు జరగడం వేరు కానీ.. ఇలా ఇంత చిన్న విషయం ఎలా మిస్సయ్యాడు? అంటూ ధోనీపై జోకులు వేస్తున్నారు. అయితే ధోనీ ఫ్యాన్స్కు ఇదేం నచ్చలేదు.