ఐపీఎల్ 2023లో టేబుల్ టాపర్గా ఉన్న చెన్నైతో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కుర్ర ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగాడు. ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై ఎదురు దాడికి దిగిన అతను ఎడాపెడా బౌండరీలతో రెచ్చిపోయాడు. ఆకాష్ సింగ్ వేసిన తొలి ఓవర్లోనే మూడు బౌండరీలతో ఆకట్టుకున్నాడు. అతని జోరుకు చెన్నై పేసర్లు బ్రేకులు వేయలేకపోయారు.
దీంతో ధోనీ ప్లాన్ మార్చి స్పిన్నర్లను బరిలో దింపాడు. జైస్వాల్ కొంచెం తడబడటంతో ఈ మార్పు పని చేసినట్లే కనిపించింది. కానీ వెంటనే తన ఆటతీరును సెట్ చేసుకన్న జైస్వాల్ మరోసారి చెలరేగాడు. ఈ క్రమంలోనే కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించే ప్రయత్నం చేశాడు. అయితే ఇదే సమయంలో జోస్ బట్లర్ (27) పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత జైస్వాల్కు కొంత సహకారం అందించిన సంజూ శాంసన్ (17) కూడా అవుటయ్యాడు. దీంతో జైస్వాల్పై బాధ్యత పెరిగింది. అతనే ఇన్నింగ్స్ వేగం పెంచాల్సి వచ్చింది. ఈ క్రమంలో సంజూ అవుటైన అదే ఓవర్లో బౌండరీ బాదాడు. ఆ తర్వాతి బంతికే మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. తుషార్ దేశ్పాండే తెలివిగా వేసిన బంతిని టైమింగ్ చేయలేకపోయాడు.
ఈ క్రమంలో గాల్లోకి లేచిన బంతిని అజింక్య రహానే చక్కగా అందుకున్నాడు. దీంతో చక్కగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ముగిసింది. అతను 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యథిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో జైస్వాల్ కూడా చేరాడు. ఈ జాబితాలో నమన్ ఓఝా అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 2010 ఐపీఎల్లో 94 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అదే ఏడాది మరో మ్యాచ్లో నమన్ ఓఝా 80 పరుగులు చేశాడు. 2015లో అజింక్య రహాే 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పుడు జైస్వాల్.. రహానేను దాటి మూడో స్థానంలో నిలిచాడు. వీళ్లు ముగ్గురూ కూడా రాజస్థాన్ రాయల్స్కు ఆయా సమయాల్లో చాలా కీలకమైన ఆటగాళ్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో బట్లర్తో కలిసి జైస్వాల్ ఈ టీంకు విధ్వంసకర ఓపెనింగ్లు అందిస్తున్నాడు. బట్లర్ కన్నా ఎక్కువ స్ట్రైక్ రేటుతో పరుగులు చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.