రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతని నమ్మకాన్ని నిలబెట్టిన యశస్వి జైస్వాల్ (77) ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. అవతలి పక్క జోస్ బట్లర్ (27) కొంత తడబడుతున్నా అతను మాత్రం చెలరేగాడు.
ఎడాపెడా బౌండరీలతో చెన్నై బౌలర్లకు జైస్వాల్ తలనొప్పులు తెప్పించాడు. అయితే బట్లర్, సంజూ శాంసన్ (17) ఇద్దరూ స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. హెట్మెయర్ (8) కూడా తక్కువ స్కోరుకే అవుట్ అవడంతో ఇక ఆ అంచనాలే పోయాయి. ఇలాంటి సమయంలో ధృవ్ జురెల్ (34), దేవదత్ పడిక్కల్ (27 నాటౌట్) కూడా అదరగొట్టారు. దీంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఈ స్టేడియంలో 200 పరుగల స్కోరు దాటిన తొలి టీం ఇదే కావడం గమనార్హం.

లక్ష్య ఛేదనలో చెన్నైకు అనుకున్న ఆరంభం దక్కలేదు. ఫామ్లో ఉన్న డెవాన్ కాన్వే (8) విఫలమయ్యాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ (47) ఆకట్టుకున్నాడు. కానీ అతనికి సహకారం అందించే వాళ్లు కరువయ్యారు. అజింక్య రహానే (12), అంబటి రాయుడు (0) దారుణంగా విఫలమయ్యారు. మధ్యలో శివమ్ దూబే (52) చివరి వరకు పోరాడాడు. మొయీన్ అలీ (23), రవీంద్ర జడేజా (23 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించారు.
అయితే రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై బ్యాటర్లు అనుకున్నంత వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా అశ్విన్ (2/35), ఆడమ్ జంపా (2/22) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కుల్దిప్ యాదవ్ కూడా ఒక వికెట్తో ఆకట్టుకున్నాడు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.

టేబుల్ టాపర్గా ఉన్న చెన్నైపై 32 పరుగుల తేడాతో నెగ్గిన రాజస్థాన్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ఈ రెండు జట్లు ఐదేసి విజయాలతో ఉన్నప్పటికీ మెరుగైన రన్రేట్ ఉన్న కారణంగా రాజస్థాన్ టేబుల్ టాపర్గా నిలిచింది. చెన్నై మూడో స్థానానికి పడిపోయింది. ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నైతో రెండు సార్లు తలపడిన రాజస్థాన్.. రెండుసార్లూ విజయం సాధించడం గమనార్హం.
ఫ్యాన్స్ కూడా దీనిపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెపాక్లో రాజస్థాన్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారని అనుకుంటే.. ఇంకా దారుణంగా ఓడిపోయారని మండిపడుతున్నారు. చెపాక్లో కూడా ఛేజింగ్ చేయడానికి ప్రయత్నించిన చెన్నై చివర్లో చేతులెత్తేసిన సంగతి తెలిసిందే.