ఐపీఎల్ 2023 ఆరంభ పోరులో గుజరాత్ చేతిలో చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్.. తమ సొంత మైదానంలో మాత్రం చెలరేగారు. చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన ఈ జట్టు.. చివరకు విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఈ జట్టు రుతురాజ్ గైక్వాడ్ (57), డెవాన్ కాన్వే (47), శివమ్ దూబే (27), అంబటి రాయుడు (27 నాటౌట్) రాణించడంతో భారీ స్కోరు చేసింది.
20 ఓవర్లలో చెన్నై 217 పరుగులు చేసింది. ఈ ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇదే టాప్ స్కోరు. లక్ష్య ఛేదనను లక్నో కూడా బలంగానే ఆరంభించింది. కైల్ మేయర్స్ (53), కేఎల్ రాహుల్ (20), మార్కస్ స్టొయినిస్ (21), నికోలస్ పూరన్ (32), ఆయుష్ బదోనీ (23) పరుగులు చేశారు. అయితే వీరి పోరాటం చివరకు వృధా అయింది. లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ విజయం అనంతరం మాట్లాడిన ధోనీ.. తమ బౌలర్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. చెన్నై బౌలర్లు ఈ మ్యాచ్లో వైడ్లు, నోబాల్స్ రూపంలో 16 ఎక్స్ట్రాలు ఇచ్చారు. దీనిపై మాట్లాడిన ధోనీ.. 'మా ఫాస్ట్ బౌలింగ్ మెరుగవ్వాలి. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేయడం నేర్చుకోవాలి. ప్రత్యర్థి బౌలర్లు ఏం చేస్తున్నారో కూడా గమనించాలి. ప్రధానంగా నోబాల్స్, వైడ్లు వేయడం మానుకోవాలి. లేదంటే వాళ్లంతా వేరే కెప్టెన్ కింద ఆడుకోవాల్సి ఉంటుంది. ఇది నా రెండో వార్నింగ్' అన్నాడు.
అలాగే చెపాక్ వికెట్పై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇక్కడ స్లో వికెట్ తయారు చేసి ఉంటారని తాము అనుకున్నామన్నాడు. 'ఇక్కడ జరగాల్సిన పర్ఫెక్ట్ ఫస్ట్ గేమ్ ఇది. పిచ్ స్లోగా ఉంటుందనుకున్నా. కానీ భారీ స్కోర్లు చేయగలిగే పిచ్ ఇది. నేనే ఆశ్చర్యపోయా. అయితే ఇలాంటి వికెట్నే మిగతా మ్యాచులకు కూడా తయారు చేయగలరా? అని చూడాలి' అన్నాడు ధోనీ. ఈ మ్యాచ్లో చివర్లో బ్యాటింగ్కు వచ్చిన ధోనీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రెండు సిక్సర్లు బాదిన సంగతి తెలిసిందే.