మూడేళ్ల తర్వాత చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ బరిలో దిగేందుకు రెడీ అయింది. కరోనా కారణంగా హోం, ఎవే ఫార్మాట్కు దూరమైన ఐపీఎల్.. ఈ ఏడాది తిరిగి పాత పద్ధతిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఈ సీజన్లో తమ తొలి హోం గేమ్కు రెడీ అవుతున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ను చెపాక్లో చిత్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్లో ఒక ఎమోషనల్ మూమెంట్ కూడా ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు జట్టులో ప్రాణమైన ఆటగాళ్లలో ఎంఎస్ ధోనీ తర్వాత ఉండే పేరు సురేష్ రైనా. అందుకే అతన్ని 'చిన్న తల' అని ఫ్యాన్స్ పిలుచుకునేవాళ్లు. ఈ మిస్టర్ ఐపీఎల్ గతేడాది ఆటకు పూర్తిగా దూరమయ్యాడు. 2022 మెగా వేలానికి ముందు చెన్నై యాజమాన్యం అతన్ని విడుదల చేసేసింది. ఆ వేలంలో రైనాను ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో అతను కామెంటరీని తన కెరీర్గా ఎంచుకున్నాడు.

ఇప్పుడు మూడేళ్ల తర్వాత చెన్నై జట్టు తిరిగి చెపాక్ చేరినా.. సురేష్ రైనా మాత్రం జట్టులో లేడు. ఇంత గ్యాప్ తర్వాత చెపాక్లో జరిగే మ్యాచ్లో 'చిన్న తల' లేకపోవడం చెన్నై అభిమానులకు కచ్చితంగా ఎమోషనల్ మూమెంట్. కొందరు ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా 'నిన్ను మిస్ అవుతున్నాం చిన్న తల' అని పోస్టులు పెడుతున్నారు. రైనా లేని లోటు ఇప్పటికీ చెన్నై జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. మిడిలార్డర్ దాదాపు ప్రతి మ్యాచులోనూ తడబడుతోంది.
ఈ ఏడాది తమ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్తో సీఎస్కే తలపడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. రుతురాజ్ గైక్వాడ్ (92) రాణించినా కూడా భారీ స్కోరు చెయ్యలేకపోయింది. ఛేజింగ్లో గుజరాత్ ఓపెనర్లు శుభ్మన్ గిల్ (63)తోపాటు వృద్ధిమాన్ సాహా (26) రాణించారు. చివర్లో రషీద్ ఖాన్ (3 బంతుల్లో 10 నాటౌట్) ధనాధన్ షాట్లతో గుజరాత్ను గెలిపించాడు. ఈ క్రమంలో రెండో మ్యాచులో అయినా గెలవాలని చెన్నై పట్టుదలగా ఉంది.