చెన్నై, లక్నో జట్ల మధ్య జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ముఖ్యంగా లక్నో ఛేజ్ చేసిన విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 217 పరుగుల భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, శివమ్ దూబే, అంబటి రాయుడు రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో లక్నోకు అనుకున్న ఆరంభం దక్కలేదు.
కెప్టెన్ కేఎల్ రాహుల్ (20) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే మరో ఓపెనర్ కైల్ మేయర్స్ (53) ధనాధన్ షాట్లతో విరుచుకుపడ్డాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో లక్నో స్కోరు 130/5గా ఉన్నప్పుడు 14వ ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్గా యువకెరటం ఆయుష్ బదోనీ (18 బంతుల్లో 23) క్రీజులోకి వచ్చాడు. అతను తన ఇన్నింగ్స్లో ఒక్కటంటే ఒక్క బౌండరీ కూడా బాదలేదు. అవతలి ఎండ్లో బ్యాటర్లు భారీ షాట్లు ఆడుతుంటే అతను మాత్రం సింగిల్స్, డబుల్స్ తీస్తూ ఉండిపోయాడు.

అంతకుముందు ఢిల్లీతో జరిగిన మ్యాచులో బదోనీ ఆకట్టుకున్నాడు. లక్నో తరఫున చివర్లో బ్యాటింగ్కు వచ్చిన అతను కేవలం 7 బంతుల్లోనే 18 పరుగులు చేశాడు. కానీ చెన్నై మ్యాచులో మాత్రం 18 బంతులు ఎదుర్కొన్నా కేవలం 23 పరుగులే చేశాడు. చాలా తక్కువగా 127.78 స్ట్రైక్ రేటుతో పరుగులు చేసిన అతను.. తుషార్ దేశ్పాండే బౌలింగ్లో ఎంఎస్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అప్పటికే అతని బ్యాటింగ్ వల్ల లక్నో విజయావకాశాలు బాగా దెబ్బతిన్నాయి.
ఢిల్లీపై చెలరేగిన బదోనీ.. చెన్నైపై ఇలా పేలవంగా ఆడటం చూసిన అభిమానులు మండిపడుతున్నారు. కొందరైతే ఐపీఎల్ అంతా ఫిక్సింగ్ అనడానికి బదోనీ బ్యాటింగే ఉదాహరణ అంటున్నారు. మరికొందరేమో బదోనీ ఇంటెంట్ ఏంటో అర్థం కాలేదని పెదవి విరిచారు. అవసరమైన రన్ రేట్ భారీగా పెరుగుతుంటే బౌండరీలు బాదేందుకు ప్రయత్నం చేయకుండా సింగిల్స్, డబుల్స్ తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా చివరకు లక్నో జట్టు ఈ మ్యాచ్ ఓడిపోవడంతో బదోనీపై విమర్శల వర్షం కురుస్తోంది.