కేవలం క్రికెట్ అని కాదు.. దాదాపు అన్ని రంగాల్లో ఎవడో ఒకడు ఉంటాడు. అతన్ని చూస్తే ప్రత్యర్థులైనా సరే చేతులెత్తి మొక్కుతారు. అతను ఏదో సాధిస్తాడని ఆశిస్తారు. అలా సాధిస్తే చప్పట్లు కొట్టి మెచ్చుకుంటారు. క్రికెట్లో అలాంటి ఆటగాళ్లలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒకడు. అతను ఏ జట్టుకు ఆడుతున్నా ప్రత్యర్థులు కూడా ధోనీకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఆటోమేటిక్గా ఆ రెస్పెక్ట్ వచ్చేస్తుందంతే.
కొందరైతే మైదానంలో ధోనీని చూస్తూ చాలా ఎగ్జయిట్ అయిపోతారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో అయితే ధోనీ క్రేజ్ ఎంతా దేశంలో పాకిపోయిందో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడ మ్యాచ్ ఆడుతున్నా.. ఆ స్టేడియం అంతా పసుపు మయం అయిపోతోంది. సీఎస్కే జెండాలు, జెర్సీలతో అభిమానులు ఆ స్టేడియాన్ని ముంచేస్తున్నారు. తాజాగా చెన్నై, కోల్కతా మ్యాచ్లో కూడా అదే జరిగింది.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై అదిరిపోయేలా ఆడింది. ఏకంగా 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో చివరి రెండు బంతులు మిగిలి ఉన్నాయనగా.. ధోనీ బ్యాటింగ్కు వచ్చాడు. ఇలా తమ అభిమాన స్టార్ మైదానంలోకి వస్తుండటంతో ఫ్యాన్స్ సంతోషంతో రెచ్చిపోయారు. స్టేడియం అంతా 'ధోనీ.. ధోనీ..' అనే నినాదాలతో హోరెత్తింది.
ఈ క్రేజ్ అంతా చూస్తున్న కేకేఆర్ కీలక ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ కూడా చప్పట్లు కొడుతూ ధోనీకి సపోర్ట్ ఇచ్చాడు. ఈ ఘటన కెమెరా కంటికి చిక్కింది. అలా తను కెమెరాలో పడుతున్నట్లు గుర్తించిన వెంటనే తను పొరపాటు చేస్తున్నానని వెంకటేశ్ అర్థం చేసుకొన్నాడు. తన ఎగ్జయిట్మెంట్ను బలవంతంగా తగ్గించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
కాగా, టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కూడా ఎంఎస్ ధోనీకి పెద్ద ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. ధోనీ ఆడటం ఎప్పుడు చూసినా తాను చాలా ఎగ్జయిట్ అవుతానని కోహ్లీ చాలాసార్లు చెప్పాడు. కొన్నిసార్లు ఆర్సీబీపై ధోనీ చెలరేగుతున్నా కూడా.. తను ప్రత్యర్థిని అని మర్చిపోతానని, ధోనీ ఆట చూసి సంతోషిస్తుంటానని వెల్లడించాడు. ఆ తర్వాత ధోనీ వల్లనే తాము ఓడిపోతున్నామని తెలిసి చిరాకేస్తుందంటూ నవ్వేసిన సంగతి తెలిసిందే.