కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైకి అదిరిపోయే ఆరంభం లభించింది. సూపర్ ఫామ్లో ఉన్న డెవాన్ కాన్వే ఈ సీజన్లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మిగతా బ్యాటర్లు కూడా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా అజింక్య రహానే ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
రహానే కేవలం 29 బంతుల్లోనే 71 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి చెన్నై జట్టు 4 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్లో కేకేఆర్ బ్యాటింగ్ తడబడింది. రింకూ సింగ్ (53 నాటౌట్) మరో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జేసన్ రాయ్ (61) కూడా రెచ్చిపోయి ఆడాడు. కానీ చెన్నైని ఓడించడంలో మాత్రం వీళ్లు విఫలమయ్యారు.

ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం తమ విజయంపై ధోనీ స్పందించాడు. తమ పేసర్లు, స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని, ప్రత్యర్థిపై ఒత్తిడి పెట్టడానికే ప్రయత్నించామని వెల్లడించాడు. 'కేకేఆర్ బ్యాటింగ్ లైనప్ చూస్తే.. వారి జట్టులో చాలా మంది బిగ్ హిట్టర్లు ఉన్నారని అర్థం అవుతుంది. ముఖ్యంగా లోయర్ ఆర్డర్లో వాళ్ల బ్యాటింగ్ చాలా ప్రమాదరకంగా ఉంది. వాళ్లకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే' అని ధోనీ చెప్పుకొచ్చాడు.
'జట్టులో ఎవరికైనా గాయమైతే అతను ఏం చేయలేడు. కాబట్టి మిగతా వారిలో బాగా ప్రిపేర్ అయిన వాళ్లకు అవకాశం ఇస్తా. అతను కుర్రాడైతే మోటివేట్ చేస్తా. వాళ్లంతా ఇలాగే మంచి ప్రదర్శనలు చేస్తూనే ఉంటారని ఆశిస్తున్నారు. స్వేచ్ఛగా ఆడనిస్తే రహానే వంటి వాళ్లు ఎంత బాగా ఆడగలరనే విషయాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నీ బలం ఏంటో తెలుసుకొని దాన్ని ఎంజాయ్ చేయాలి. ఆ ఆటగాళ్లు రాణించే ఛాన్స్ ఉన్న పొజిషన్లో ఆడించాలి. ఆ పొజిషన్ను మరొకరు త్యాగం చేయక తప్పదు కదా' అని పేర్కొన్నాడు.
సాధారణంగా చెన్నై టీంలో అంబటి రాయుడు నాలుగో నెంబర్లో ఆడతాడు. మొయీన్ అలీ కూడా మూడు, నాలుగో నెంబర్ ఆటగాడే. అయితే వీళ్లందర్నీ కాదని రహానేను మూడో స్థానంలో, శివమ్ దూబేని నాలుగో స్థానంలో ధోనీ పంపిస్తున్నాడు. వీళ్లిద్దరూ కూడా అద్భుతం ఆడుతూ చెన్నైకి భారీ స్కోర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే.