ఐపీఎల్లో ఐదోసారి చెన్నై ట్రోఫీ నెగ్గింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ధోనీ సేన మరో టైటిల్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత ధోనీ చేసిన పని తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ ట్రోఫీ అందుకునేందుకు ధోనీ ఒంటరిగా వెళ్లలేదు. ఈ మ్యాచ్కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు, రవీంద్ర జడేజా ఇద్దర్నీ తనతో తీసుకెళ్లాడు.
వేదికపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవాల్సిన ధోనీ.. ఆ బాధ్యతను రాయుడుకు అప్పగించాడు. దీంతో చాలా ఎమోషనల్ అయిపోయిన రాయుడు.. నవ్వుతూ ట్రోఫీ అందుకున్నాడు. జడేజా కూడా ట్రోఫీపై ఒక చెయ్యి వేసి సంతోషంగా నవ్వుతూ కనిపించాడు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటేంటే.. ట్రోఫీని అప్పటికి ధోనీ టచ్ చేయలేదు. దీనికి సంబంధించి వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందుకే ధోనీ అంటే చాలా మందికి ఇష్టమని ఫ్యాన్స్ అంటున్నారు. ధోనీ ఎప్పుడూ తాను క్రెడిట్ తీసుకోడని, తన కష్టం క్రెడిట్ కూడా పక్క వారికే ఇచ్చేస్తాడని చెప్తున్నారు.
ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 214 పరుగుల భారీ స్కోరు చేసింది. చెన్నై ఛేజింగ్ మొదలు పెట్టిన కాసేపటికే మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం ఆగినా మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ ఆలస్యమైంది.
చివర్లో చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 172 పరుగులకు కుదించారు. ఈ క్రమంలో రహానే, రాయుడు, జడేజా చాలా వేగంగా ఆడారు. భారీ షాట్లతో క్రీజులో ఉన్న కాసేపు అభిమానులను అలరించారు. దాంతోపాటు స్కోరు బోర్డును కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లారు. చివరి రెండు బంతుల్లో పది పరుగులు కావలసి ఉండగా.. 6,4 బాదిన జడేజా టీంకు విజయాన్ని అందించాడు.