ఐపీఎల్లో ధోనీ సేన మరో ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు నెగ్గిన జట్టుగా ముంబై రికార్డును చెన్నై సమం చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో చివరి బంతికి గుజరాత్ను ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. చెన్నై ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది.
అయితే చెన్నై ఛేజింగ్ మొదలైన వెంటనే వర్షం పడింది. దీంతో మ్యాచ్ కాసేపు నిలిపి వేయాల్సి వచ్చింది. అవుట్ ఫీల్డ్ను మ్యాచ్కు సిద్ధం చేసే సరికి చెన్నై ఇన్నింగ్స్ను 15 ఓవర్లకు కుదించారు. అలాగే ఆ టీం టార్గెట్ను కూడా 171 పరుగులకు మార్చారు. ఇలాంటి సమయంలో డెవాన్ కాన్వే (47), రుతురాజ్ గైక్వాడ్ (26) అద్భుతంగా ఆడారు.

వీరితోపాటు అంబటి రాయుడు (18), అజింక్య రహానే (27), శివమ్ దూబే (32 నాటౌట్), జడేజా (15 నాటౌట్) రాణించారు. దీంతో ఆ జట్టు చివరి బంతికి విజయం సాధించి మరో ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ సహా పలువురు సెలెబ్రిటీలు చెన్నై టీంకు, ధోనీకి కంగ్రాట్స్ చెప్పారు.
'వాట్ ఎ ఛాంపియన్ రవీంద్ర జడేజా.. వెల్ డన్ సీఎస్కే. ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి' అని కోహ్లీ తన ఇన్స్టాగ్రాం స్టోరీ షేర్ చేశాడు. కోహ్లీ భార్య అనుష్క కూడా దీనిపై స్పందించింది. 'ఎంత ఎగ్జయిటింగ్ గేమ్. అద్భుతమైన విజయం. అద్భుతమైన టీం' అని ఆమె మెచ్చుకుంది.

టీమిండియా లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ టీంను తెగ మెచ్చుకున్నాడు. 'వావ్! ఏం గెలిచారు? జడ్డూ అద్భుతంగా ఆడాడు. రాయుడు, రహానే, దూబే అద్భుతమైన సహకారం అందించారు. మోహిత్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ అసాధ్యమైన పరిస్థితి నుంచి కూడా గెలవడం చెన్నైకి బాగా తెలుసు. చివరి వరకు విజిల్పూడే' అంటూ చెన్నై గెలిచిన ఫొటోను షేర్ చేశాడీ లెజెండ్.
చెన్నై టీం మాజీ సభ్యులు ఊతప్ప, సురేష్ రైనా కూడా ఈ విజయాన్ని మెచ్చుకున్నారు. 'ఈ పెద్ద సీఎస్కే కుటుంబంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. ఈ విజయం ఒక అద్భుతమైన ప్రయాణానికి దక్కిన ఫలితం. ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి' అని రైనా ట్వీట్ చేశాడు. 'ఐదో టైటిల్. ఈ ఐపీఎల్ సీజన్కు అద్భుతమైన ముగింపు దక్కింది. ఏం థ్రిల్? గుజరాతీ కుర్రాడు జడేజా చెన్నైని గెలిపించాడు. కంగ్రాచ్యులేషన్స్ చెన్నై' అని ఊతప్ప శుభాకాంక్షలు చెప్పాడు.