ఐపీఎల్ మజా అంటే ఇదే కదా. 74 మ్యాచుల తర్వాత జరిగిన ఫైనల్లో ఒక ఆసక్తికర అంశం అర్థం చేసుకోవడంలో చాలా మంది ఫెయిలయ్యారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోరు చేసేలా కనిపించలేదు. శుభ్మన్ గిల్ (39) త్వరగానే అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (54) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
అయితే అతనికి జత కలిసిన సాయి సుదర్శన్ ఈ జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తం 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. అతని భారీ ఇన్నింగ్స్కు హార్దిక్ పాండ్యా (21 నాటౌట్) జతకలిశాడు. దీంతో ఆ జట్టు 214 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఛేజింగ్లో వర్షం కారణంగా చెన్నై టార్గెట్ 15 ఓవర్లలో 171కి కుదించారు. ఈ ఇన్నింగ్స్లో ఓపెనర్ డెవాన్ కాన్వే (47) కీలక పాత్ర పోషించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన అతను జట్టుకు మంచి ఆరంభం అందించాడు. ఆ తర్వాత రహానే (27), రాయుడు (18), శివమ్ దూబే (32 నాటౌట్) కూడా ఆకట్టుకున్నారు. అయితే చివర్లో రవీంద్ర జడేజా (6 బంతుల్లో 15 నాటౌట్) అదరగొట్టాడు.
జడేజానే చెన్నైకి విజయాన్ని అందించాడు. కీలక సమయంలో బౌండరీలు బాదిన అతను చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేసి జట్టుకు ట్రోఫీ అందించాడు. ఇక్కడే ఒక విషయం అందరూ మిస్ అయ్యారు. గుజరాత్ విజయానికి కష్టపడి, భారీ స్కోరు చేసిన సాయి సుదర్శన్ తమిళనాడుకు చెందిన వాడు. తమిళ కుర్రాడైన అతను చెన్నైని ఓడించడానికి శాయశక్తులా ప్రయత్నించాడు.
అదే సమయంలో గుజరాత్ను ఓడించి, చెన్నైకి ట్రోఫీ అందించిన జడేజా గుజరాతీ. అంటే అతను సొంత రాష్ట్రంపై చెన్నైని గెలిపించాడన్నమాట. ఇది గమనించిన కొందరు అభిమానులు ఇదే కదా ఐపీఎల్ మజా అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత జడేజా కూడా తన హోం క్రౌడ్ ముందు గెలవడం సంతోషంగా ఉందన్నాడు. ఇలాంటి అద్భుతాలు మరెక్కడా కనిపించవు అంటూ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.