ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతం సృష్టించింది. ధోనీ సేన మరో ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు నెగ్గిన జట్టుగా ముంబై రికార్డును చెన్నై సమం చేసింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో చివరి బంతికి గుజరాత్ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించింది. శుభ్మన్ గిల్ (39), వృద్ధిమాన్ సాహా (54) అద్భుతంగా రాణించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్ (96) ప్రత్యర్థి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. చెన్నై ముందు భారీ లక్ష్యాన్ని నిలిపింది.

అయితే చెన్నై ఛేజింగ్ మొదలైన వెంటనే వర్షం పడింది. దీంతో మ్యాచ్ కాసేపు నిలిపి వేయాల్సి వచ్చింది. అవుట్ ఫీల్డ్ను మ్యాచ్కు సిద్ధం చేసే సరికి చెన్నై ఇన్నింగ్స్ను 15 ఓవర్లకు కుదించారు. అలాగే ఆ టీం టార్గెట్ను కూడా 172 పరుగులకు మార్చారు. ఇలాంటి సమయంలో డెవాన్ కాన్వే (47), రుతురాజ్ గైక్వాడ్ (26) అద్భుతంగా ఆడారు.
వీరితోపాటు అంబటి రాయుడు (18), అజింక్య రహానే (27), శివమ్ దూబే (32 నాటౌట్), జడేజా (15 నాటౌట్) రాణించారు. దీంతో ఆ జట్టు చివరి బంతికి విజయం సాధించి మరో ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. ఈ విజయం అనంతరం ధోనీ చాలా ఎమోషనల్ అయిపోయాడు. పరిస్థితిని బట్టి చూస్తే రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇదే సరైన టైం అని ధోనీ అభిప్రాయపడ్డాడు.
'ఒక విధంగా చూస్తే రిటైర్మెంట్ తీసుకోవడానికి ఇది బెస్ట్ టైం. థాంక్యూ అని చెప్పేసి రిటైర్ అవడం నాకు ఇప్పుడు చాలా ఈజీ. కానీ మరో 9 నెలలు కష్టపడి ఇంకొక్క సీజన్ ఆడటం కష్టమైన పని. శారీరకంగా చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ సీఎస్కే అభిమానులు నాపై చూపించిన ప్రేమను చూస్తే.. వాళ్ల కోసం మరొక్క సీజన్ ఆడాలని అనిపిస్తోంది' అని ధోనీ చెప్పాడు.
'ఇది నా కెరీర్లో చివరి దశ. అది ఇక్కడే మొదలైంది. స్టేడియం అంతా నా పేరు పిలుస్తోంది. చెన్నైలో కూడా ఇలాగే ఉంది. కానీ ఇంకొక్కసారి మైదానంలో దిగి నేను ఆడగలిగినంత ఆడితే బాగుంటుంది అనుకుంటున్నా. నేను చాలా సింపుల్గా ఆడతా. నా దృష్టిలో ద్వైపాక్షిక సిరీసులే కాదు ఏ ట్రోఫీ నెగ్గాలన్నా దానికి సంబంధించిన కష్టాలు ఉండనే ఉంటాయి. చిట్టచివరి క్షణాలు వచ్చినప్పుడు మన టీంలోని ఆటగాళ్లు రెడీగా ఉండటమే ఇంపార్టెంట్' అని ధోనీ వివరించాడు.
'ఒక్కో ఆటగాడు ఒక్కో రేంజ్లో ఒత్తిడిని ఎదుర్కోగలుగుతాడు. మేం అదే చేయాలని అనుకున్నాం. రహానే మంచి అనుభవం ఉన్నవాడు. అదే కుర్రాళ్లు కన్ఫ్యూజ్ అయితే వాళ్లతో మేం మాట్లాడతా. ఇక రాయుడు మైదానంలో దిగితే తన హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు. అదే అతని స్పెషాల్టీ. ఇండియా-ఎ టీంకు మేం ఇద్దరం కలిసి ఆడాం. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్ ఏదైనా అతను బాగా ఆడతాడు. తను ఏదో స్పెషల్ చేస్తాడని ఎప్పుడూ అనుకుంటూనే ఉన్నా. తను కూడా నాలాగే ఎక్కువగా ఫోన్ వాడడు' అని నవ్వేశాడు.