భారత క్రికెటర్లలో మోస్ట్ అండర్ రేటెడ్ ఆటగాళ్ల జాబితా తయారు చేస్తే దానిలో కచ్చితంగా తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు పేరు ఉంటుంది. అపారమైన ట్యాలెంట్ ఉన్నా కూడా అతను భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఐపీఎల్లో మాత్రం అద్భుతంగా రాణించిన అతను ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్సులు ఆడాడు.
తాజాగా గుజరాత్, చెన్నై జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ జరగనుంది. ఆదివారం ఈ మ్యాచ్ ప్రారంభం అవడానికి కొంత సమయం ఉందనగా రాయుడు షాకింగ్ విషయం వెల్లడించాడు. తాను ఇక ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నానని, మళ్లీ ఈ విషయంలో యూటర్న్ తీసుకోబోనని స్పష్టం చేశాడు.

ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు, రాయుడుతో కలిసి ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్ రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశాడు. రాయుడు చాలా తెలివైన క్రికెటర్ అని చెప్పిన అతను.. రాయుడిని భారత టెస్టు జట్టులో కూడా ఆడించాల్సిందని, మిగతా ఏ జట్టు అయినా సరే అతన్ని తమ టీంలోకి తీసుకునేదని అభిప్రాయపడ్డాడు.
'అతను ఎంతో చేశాడు. క్రికెట్లో భారత్ తయారు చేసిన మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్లలో రాయుడు ఒకడు. అతను అసలు టెస్టు క్రికెట్ ఆడాల్సింది. ఇలాంటి ఆటగాడికి కనీసం అవకాశం రాలేదని చెప్తుంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. క్రికెట్ గురించి పూర్తిగా తెలిసిన వాడు రాయుడు. దానికితోడు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేరపుతూనే ఉంటాడు' అని వివరించాడు.
'అబ్జల్యూట్ టీం ప్లేయర్ రాయుడు. జట్టు కోసం ఏం చేయడానికైనా అతను రెడీ. అలాంటి వాడిని ఏ టీం అయినా తీసుకుంటుంది. నేను నా జూనియర్ రోజుల నుంచే అతన్ని అభిమానించే వాడిని' అని చెప్పాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు ముంబైతో ఒకటి, చెన్నైతో నాలుగు మొత్తం కలిపి ఐదు ట్రోఫీలు నెగ్గాడు రాయుడు. అయితే ఈ సీజన్లో పెద్దగా రాణించడం లేదు. మొత్తం 11 మ్యాచుల్లో కేవలం 139 పరుగులే చేయగలిగాడు.