ఐపీఎల్ ఫైనల్కు అంతా రెడీ అయిపోయింది. ఆదివారంతో ఈ సూపర్ టోర్నీ ముగుస్తుందని అంతా అనుకున్నారు. కానీ వాన దేవుడు వేరే ప్లాన్ వేశాడు. దీంతో ఆదివారం సాయంత్రం జరగాల్సిన మ్యాచ్ పూర్తిగా వర్షార్పణం అయిపోయింది. కనీసం టాస్ కూడా వేయడం కుదర్లేదు. వర్షం కొంచెం కూడా తగ్గలేదు.
కొంచెం వర్షం తగ్గే సరికి చాలా ఆలస్యం అయిపోయింది. అప్పటికి భారీగా తడిసిపోయిన మైదానాన్ని మ్యాచ్కు సిద్ధం చేయడానికి చాలా టైం పడుతుంది. ఇదంతా అర్థం చేసుకున్న అంపైర్లు మ్యాచ్ను ఆదివారం నాడు రద్దు చేశారు. రిజర్వ్ డే అయిన సోమవారం ఈ మ్యాచ్ నిర్వహించాలని నిర్ణయించారు. అదే విషయాన్ని ప్రకటించారు.

మరి ఆదివారం అంతలా వర్షం కురిస్తే సోమవారం మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా? అని కొందరు అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వాతావరణ శాఖ అంచనాల ప్రకారం సోమవారం సాయంత్రం అహ్మదాబాద్లో వర్షం పడే అవకాశం కేవలం 10 శాతమే ఉందట. దీంతో పూర్తి 40 ఓవర్ల ఆటను ప్రేక్షకులు ఎంజాయ్ చేయొచ్చని తెలుస్తోంది.
వినడానికి ఇది బాగానే ఉన్నా.. ఆదివారం కూడా మ్యాచ్కు వర్షం అంత అంతరాయం కలిగించదని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. కానీ ఆ అంచనాలను తలకిందులు చేసిన వరుణ దేవుడు.. స్టేడియాన్ని ముంచేశాడు. దీంతో సోమవారం సాయంత్రం ఏం జరుగుతుందో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
ఇక వాతావరణ వివరాలు వెల్లడించే ప్రముఖ వెబ్సైట్ ఆక్యూవెదర్ అంచనాల ప్రకారం, సోమవారం నాడు అహ్మదాబాద్లో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువ. అది కూడా మ్యాచ్ జరిగే సమయంలో దాదాపుగా వర్షం పడదు. అలాగే వాతావరణం 33 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మరి మ్యాచ్ సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.