ఐపీఎల్ చివరి అంకానికి చేరుకుంది. తాడోపేడో తేల్చుకొని ట్రోఫీ తమ ఖాతాలో వేసుకునేందుకు గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు రెడీ అవుతున్నాయి. అయితే అహ్మదాబాద్లో తెగ వర్షం కురవడంతో ఆదివారం జరగాల్సిన మ్యాచ్ను సోమవారానికి వాయిదా వేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
ఆదివారం నాడు మ్యాచ్ జరగాల్సిన సమయంలో వర్షం పడే సూచనలు పెద్దగా లేవని వాతావరణ శాఖ చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఆ సమయానికి ఆకాశానికి చిల్లులు పడినట్లే వర్షం పడింది. మధ్యలో ఒకటి రెండు సార్లు ఆగినట్లే ఆగిన వర్షం మళ్లీ కుండపోతగా కురిసింది. ఇదంతా చూసిన ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడ్డారు.

ముఖ్యంగా ఫైనల్ చూసేందుకు చాలా దూరం నుంచి ఫ్యాన్స్కు ఐపీఎల్ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే సోమవారం నాడు మ్యాచ్ సమయంలో వర్షం పడటానికి 10 శాతం అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. దీన్ని చూపిస్తున్న కొందరు.. 'ఆదివారం వర్షం లేదన్నారు. కానీ మ్యాచ్ జరగలేదు. ఇక సోమవారం ఏం అవుతుందో' అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం ఆట చూసేందుకు వచ్చిన వాళ్లలో పలువురు విదేశాల నుంచి ఈ మ్యాచ్ కోసం ఇక్కడకు వచ్చిన వాళ్లు ఉన్నారు. వాళ్లు ఈ నిర్ణయంతో కొంత ఇబ్బంది పడ్డారు. ఇది చూపిన కొందరు మరో అంశాన్ని ఎత్తి చూపుతున్నారు. ఈ మ్యాచ్ రిజర్వ్ డేలో జరుగుతుండటంతో ఇదే ధోనీకి చివరి మ్యాచ్ అంటున్నారు.
'రిజర్వ్ డేలో మ్యాచ్ జరిగిందంటే.. అది ధోనీకి చివరి మ్యాచ్ అయి ఉంటుందని కొందరు ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. కాగా, ఈ మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందే తెలుగు స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు తను ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. మళ్లీ యూటర్న్ తీసుకోనని చెప్పాడు. మరి రిజర్వ్ డేలో మ్యాచ్ ముగిశాక ధోనీ కూడా ఇలాగే బాంబు పేలుస్తాడని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.