ఐపీఎల్ ఫ్యాన్స్కు బీసీసీఐ గట్టి వార్నింగ్ ఇచ్చింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ ఆదివారం నాడు రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ను సోమవారం సాయంత్రం నిర్వహించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ క్రమంలో తమ టికెట్లను జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రేక్షకులను బీసీసీఐ కోరింది.
శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా తదితరులు కూడా అభిమానులకు ఇదే విజ్ఞప్తి చేశారు. ఇలా స్టేడియానికి వచ్చిన తర్వాత వర్షం కారణంగా మ్యాచులు రద్దయితే.. అభిమానులు ఫ్రస్ట్రేషన్తో టికెట్లు చించేయడం పరిపాటే. అయితే అలా చేయొద్దని, టికెట్లను జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రేక్షకులను బీసీసీఐ కోరింది.

ఇలా ఫిజికల్ టికెట్లు ఉన్న వారిని మాత్రమే రిజర్వ్ డే రోజున మ్యాచ్ చూసేందుకు అనుమతిస్తామని తేల్చిచెప్పింది. అలా లేని పక్షంలో వారిని స్టేడియంలోని అనుమతించడం జరగదని కరాఖండీగా చెప్పేసింది. దీంతో అభిమానులు టెన్షన్లో పడ్డారు. డిజిటల్ కాపీ ఉందనే ధైర్యంతో ఫిజికల్ కాపీని చించేసినా కూడా స్టేడియంలోకి రావడం కుదరదని బీసీసీఐ స్పష్టం చేయడం గమనార్హం.
పూర్తి టికెట్ ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తామని, ఒక వేళ చించేసినా కూడా పూర్తి టికెట్ ముక్కలు ఉంటే పర్లేదని తెలిపింది. టికెట్ మీద ఉండే కీలకమైన సమాచారం అంతా కనిపిస్తున్న వారినే అనుమతిస్తామని వెల్లడించింది. సగం టికెట్ ముక్కలే ఉన్నాయని చెప్పినా, అలాగే కేవలం డిజిటల్ కాపీ మాత్రమే ఉందని చెప్పినా స్టేడియంలోకి వెళ్లడం అసాధ్యమని పేర్కొంది.
అహ్మదాబాద్లో ఆదివారం సాయంత్రం భారీగా వర్షం పడిన సంగతి తెలిసింది. ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు పడ్డాయి. దీంతో మ్యాచ్ జరిగే నరేంద్ర మోదీ స్టేడియంలో నీళ్లు ఏరులై పారాయి. మధ్యలో వర్షం ఆగినట్లే ఆగి, మళ్లీ కుంభవృష్టి మొదలైంది. దీంతో మ్యాచ్ను రిజర్వ్ డేకు వాయిదా వేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.