ఐపీఎల్ ఫైనల్ పోరుకు అంతా సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి క్వాలిఫైయర్లో తలపడిన గుజరాత్, చెన్నై జట్లు మరోసారి ట్రోఫీ కోసం ఫైనల్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఐపీఎల్ 2023 ట్రోఫీని ముద్దాడుతుంది.
మొదటి క్వాలిఫైయర్లో గుజరాత్ను చిత్తుగా ఓడించిన చెన్నై నేరుగా ఫైనల్ చేరింది. అయితే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్లో ముంబైపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన గుజరాత్ అద్భుతమైన విజయంతో ఫైనల్కు వచ్చింది. మొదటి క్వాలిఫైయర్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అవుతోంది.

ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా ఐపీఎల్లో పలు రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఇలాంటి సమయంలో గెలిచిన జట్టు అందుకునే ట్రోఫీ గురించి ఒకసారి మాట్లాడుకుందామా? ఈ ట్రోఫీపై సంస్కృతంలో ఒక వాక్యం రాసి ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసుకోవాలని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి ఆ వివరాలు ఏంటంటే?
ఐపీఎల్ ట్రోఫీపై సంస్కృతంలో 'యత్ర ప్రతిభ అవసర ప్రప్నోతిహి' అని రాసి ఉంది. దీని అర్థం ఏంటంటే.. 'ఎక్కడ ప్రతిభకు అవకాశాలు దక్కుతాయో అది' అని అర్థం అన్నమాట. ఈ మాటకు ఐపీఎల్ ఎప్పటి నుంచో న్యాయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ వల్లనే భారత్కు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, జస్ప్రీత్ బుమ్రా, ఉమ్రాన్ మాలిక్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు దొరికారు.

ఐపీఎల్లో ఎందరో ఆటగాళ్లు తమ సత్తా చాటి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. తాజాగా ముంబై పేసర్ ఆకాష్ మధ్వాల్ కూడా ఎలిమినేటర్లో కేవలం ఐదు పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటువంటి ట్యాలెంట్ ఉన్న ఆటగాళ్లకు కావలసిన గుర్తింపు తీసుకురావడంలో ఐపీఎల్ ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం.