ఈ ఏడాది ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి అందరినీ పట్టి పీడిస్తున్న విషయం ఒకటే. టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని, ఈ సీజన్ తర్వాత అతను రిటైర్మెంట్ తీసుకుంటాడని జరుగుతున్న ప్రచారం. చాలా మంది ఇదే నిజమని నమ్మారు కూడా. అయితే ఈ విషయంపై ఇప్పటికీ పెద్దగా క్లారిటీ రాలేదు.
ఇటీవల ఇదే విషయంపై మాట్లాడిన ధోనీ మళ్లీ లీగ్ మొదలవడానికి చాలా టైం ఉందని, అప్పటి వరకు తను ఆలోచించుకుంటానని అన్నాడు. అయితే అసలు వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతావా? అని అడిగితే మాత్రం మాట దాటేశాడు. దీంతో ధోనీ రిటైర్మెంట్పై మరింత సందిగ్ధత నెలకొంది. అదే సమయంలో మరికొందరు ఇంకో కొత్త వాదన వినిపిస్తున్నారు.

ఐపీఎల్లో కొత్తగా తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ధోనీకి కలిసొస్తుందని, ఇలా ఇంపాక్ట్ ప్లేయర్గా అతను మరో మూడు నాలుగేళ్లు ఆడేస్తాడని కొందరు అంటున్నారు. షేన్ వాట్సన్, డ్వేన్ బ్రావో వంటి ఆటగాళ్లు కూడా ఇదే విషయం చెప్పారు. కానీ అలా మాత్రం అసలు జరగదని టీమిండియా లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నాడు. ధోనీ ఆడితే ఆటగాడిగానే ఆడతాడని, అంతేకాని ఇంపాక్ట్ ప్లేయర్గా రాడని తేల్చేశాడు.
'నలభై ఏళ్ల వయసు ఉన్నా కూడా ఆటగాడు ఫిట్గా ఉంటే క్రికెట్ ఆడటం కష్టమేమీ కాదు. ధోనీ బ్యాటింగ్ చేసే స్థానం చూస్తే.. అతను ఈ సీజన్లో కూడా 40-50 బంతులకు మించి ఎదుర్కోలేదు. కాబట్టి అతను పూర్తిస్థాయి ప్లేయర్గానే ఆడొచ్చు. అంతేకానీ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా మాత్రం ధోనీ ఆడటం జరగదు. ఆ రూల్ ధోనీకి వర్తించదు' అని స్పష్టం చేశాడీ మాజీ ఓపెనర్.
'ధోనీకి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వర్తించదు. ఎందుకంటే అతను కేవలం కెప్టెన్సీ కోసమే ఆడుతున్నాడు. కెప్టెన్సీ చేయాలంటే అతను మైదానంలో ఉండక తప్పదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అలాంటి వారి కోసం కాదు. కేవలం బ్యాటర్ లేదా బౌలర్ కావాలంటే ఈ రూల్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ధోనీ 20 ఓవర్లపాటు ఫీల్డింగ్ చేయాలి. అతను కెప్టెన్ కాకపోతే ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా ఆడడు. అప్పుడు మెంటార్గానో, కోచ్గానో లేదంటే డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గానో అతన్ని చూస్తాం' అని సెహ్వాగ్ వివరించాడు.