ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ ఓపెనర్ శుభ్మన్ గిల్ అదిరిపోయే ఫామ్లో ఉన్నాడు. అతను ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో మూడు శతకాలతో అదరగొట్టాడు. తాజాగా రెండో క్వాలిఫైయర్లో ముంబైపై ఏకంగా 129 పరుగులతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే.
ఇప్పటి వరకు ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఎవరు అంటే చటుక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. 2016లో ఆర్సీబీ ఫైనల్ చేరడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థులకు తన బ్యాటింగ్ విశ్వరూపం చూపించిన అతను.. ఆ ఏడాది 16 మ్యాచుల్లో ఏకంగా 973 పరుగులు చేశాడు.

ఆ సీజన్లో కోహ్లీ నాలుగు శతకాలు, ఎనిమిది హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు. ఆ ఏడాది కోహ్లీ సగటు 81.08 కాగా, స్ట్రైక్ రేటు 152.03గా ఉంది. ఆ తర్వాత అతనికి దగ్గరగా వచ్చిన బ్యాటర్ ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్. గతేడాది అద్భుతమైన ఫామ్ కనబరిచిన అతను 17 మ్యాచుల్లో 863 పరుగులు చేశాడు.
ఈ సీజన్లో రాజస్థాన్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోఫించిన అతను 57.53 సగటు, 149.05 స్ట్రైక్ రేటుతో నాలుగు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలతో రాణించాడు. అతని తర్వాత ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా గిల్ నిలిచాడు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్లో ఉన్న అతను ఇప్పటి వరకు 851 పరుగులు చేశాడు.
ఇప్పటి వరకు 16 మ్యాచులు ఆడిన గిల్ 60.78 సగటు, 156.43 స్ట్రైక్ రేటుతో మూడు శతకాలు, నాలుగు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ అజేయ రికార్డును అధిగమించాలంటే గిల్ ఇంకా 123 పరుగులు చేయాల్సి ఉంటుంది. చివరగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో గిల్ (42) పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఫైనల్ జరిగేది అతనికి అచ్చొచ్చిన అహ్మదాబాద్లో కావడంతో ఈ రికార్డుపై గిల్ కన్ను పడింది.
ఫైనల్లో కనుక అతను మరో సెంచరీతో చెలరేగితే కోహ్లీ రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. మరి గిల్కు ధోనీ ఈ ఛాన్స్ ఇస్తాడా? అనేది చూడాలి. ఎందుకంటే గిల్ కనుక చెలరేగితే గుజరాత్ను ఓడించడం ధోనీ సేనకు అంత ఈజీ కాదు. అతన్ని కట్టడి చేస్తేనే చెన్నై మరో ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంటుంది.