ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అందరిని తన ఆటతో మెప్పించిన కుర్ర ప్లేయర్ శుభ్మన్ గిల్. తను చివరగా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడు సెంచరీలతో మెరిశాడీ యంగ్ ఓపెనర్. తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన రెండో క్వాలిఫైయర్లో అద్భుతమైన శతకంతో చెలరేగాడు. ఈ క్రమంలో తన ఆటతీరు గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.
గతేడాది గుజరాత్ ఫ్రాంచైజీకి ఆడటం మొదలు పెట్టినప్పటి నుంచి గిల్ ఆటతీరే మారిపోయింది. ఆ తర్వాతే అతను తన తొలి అంతర్జాతీయ శతకం కూడా సాధించాడు. ఆరంభాలను భారీ ఇన్నింగ్సులుగా మార్చలేడని అతనపై ఉన్న ముద్రను చెరిపేసుకున్నాడు. తనలో ఈ మార్పుకు గుజరాత్ టైటాన్స్ చాలా సాయపడిందని గిల్ చెప్పాడు.

మరీ ముఖ్యంగా హార్దిక్ పాండ్యా తనకు ఎంతో అండగా నిలిచాడని అన్నాడు. 'గతేడాది ఐపీఎల్ మొదలవక ముందే హార్దిక్ నన్ను కలిశాడు. నాకు నచ్చినట్లు ఆడాలని సలహా ఇచ్చాడు. గుజరాత్కు ఆడటానికి ముందు.. నేను నాలా ఆడటం లేదని నాకు అనిపించేది. అలాంటి సమయంలో నాకు నచ్చినట్లు ఆడే కాన్ఫిడెన్స్ను హార్దిక్ నాకిచ్చాడు' అని వెల్లడించాడీ యంగ్ ఓపెనర్.
అలాగే సన్రైజర్స్పై తను బాదిన మొదటి సెంచరీ తనకు ఒక మెంటల్ స్విచ్లా పని చేసిందని చెప్పాడు. 'ఐపీఎల్ మొదటి సగంలో నాకు మంచి ఆరంభాలు దక్కాయి. కానీ వాటిని భారీ ఇన్నింగ్సులుగా మార్చలేకపోయా. అప్పుడే నాకు తెలుసు ఒక్క సెంచరీ చేస్తే.. నా ఆలోచన మారిపోతుందని. అప్పుడు ఆటతీరు కూడా మారుతుంది. నా విషయంలో కూడా అదే పనిచేసిందని నమ్ముతున్నా' అని వివరించాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గిల్ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో 60.79 సగటు, 156.43 స్ట్రైక్ రేటుతో ఏకంగా 851 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఒక ఐపీఎల్ సీజన్లో 800 పరుగుల మార్కును దాటిన లెజెండ్స్ సరసన నిలిచాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్, జోస్ బట్లర్ ఈ ఘనత సాధించారు.