ఐపీఎల్ ఫైనల్లో అందరి చూపూ గుజరాత్ యువ ఓపెనర్ శుభ్మన్ గిల్పైనే ఉండనుంది. ఈ ఐపీఎల్లో అతను ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో మూడింట గిల్ సెంచరీలు బాదాడు. అంతేకాదు, ముంబైతో జరిగిన రెండో క్వాలిఫైయర్లో అయితే అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలతో అదరగొట్టాడు.
ఈ మ్యాచ్లో 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంటే రెండో యాభై పరుగులు చేయడానికి అతను కేవలం 17 బంతులే తీసుకున్నాడన్నమాట. ఈ మ్యాచ్లో అతను 129 పరుగులు చేశాడు. ప్లేఆఫ్స్లో ఒక ప్లేయర్ బాదిన అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే కావడం గమనార్హం.

ఈ ఇన్నింగ్స్లో గిల్ ఏకంగా పది సిక్సర్లు బాదాడు. దీంతో ఈ సీజన్లో ఇప్పటి వరకు గిల్ బాదిన సిక్సర్ల సంఖ్య 33కు చేరింది. గత మూడు సీజన్లలో కలిపి గిల్ బాదిన సిక్సర్లు 32 మాత్రమే కావడం గమనార్హం. అంటే గత మూడేళ్ల కన్నా కూడా ఈ ఏడాదే గిల్ ఎక్కువ సిక్సర్లు బాదాడన్నమాట. ఇదే క్రమంలో గిల్ మరో కీలక రికార్డు కూడా నెలకొల్పాడు.
ఇది గిల్కు వరుసగా మూడో ఐపీఎల్ ఫైనల్ కావడం గమనార్హం. 2021లో కోల్కతా నైట్ రైడర్స్తో ఉన్న అతను ఫైనల్ ఆడాడు. అనంతరం 2022లో గుజరాత్ తరఫున ఆడిన అతను ఫైనల్ చేరడమే కాకుండా.. ఆ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ కూడా నెగ్గాడు. ఇప్పుడు వరుసగా మూడోసారి ఐపీఎల్ ఫైనల్ చేరాడు. అంతేకాదు, ఈ ఏడాది సూపర్ ఫామ్లో ఉన్న గిల్.. ముంబైపై సెంచరీతో ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ను దాటేశాడు.
ఇప్పటి వరకు గిల్ 850 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ సీజన్లో 800పైగా పరుగులు చేసిన మూడో బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్ మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు గిల్ వీళ్లిద్దరి సరసన చేరడం గమనార్హం. మరి ఫైనల్లో గిల్ ఏమాత్రం రాణిస్తాడో చూడాలి.