ఐపీఎల్ చివరి అంకానికి చేరింది. మరొక్క మ్యాచ్ జరిగితే ట్రోఫీ నెగ్గేది ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ ట్రోఫీ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన ఈ రెండు జట్లే తొలి క్వాలిఫైయర్లో కూడా తలపడిన సంగతి తెలిసిందే.
చెపాక్ వేదికగా జరిగిన మొదటి క్వాలిఫైయర్లో చెన్నై విజయం సాధించింది. అయితే ఆ తర్వాత రెండో క్వాలిఫైయర్లో గుజరాత్ చెలరేగింది. ముంబైపై అద్భుతమైన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండో సారి ఫైనల్ చేరిన గుజరాత్.. మరోసారి చెన్నైతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్లో కనుక చెన్నై నెగ్గితే ధోనీ సేన్ పలు రికార్డులు బద్దలు కొట్టనుంది.

రోహిత్ రికార్డు సమం..
ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యధిక ట్రోఫీలు నెగ్గిన కెప్టెన్గా రోహిత్ శర్మ ఉన్నాడు. అతను తన ఐపీఎల్ కెరీర్లో కెప్టెన్గా ఐదు ట్రోఫీలు నెగ్గాడు. అతని తర్వాతి స్థానంలో నాలుగు ట్రోఫీలతో ధోనీ ఉన్నాడు. ఈసారి కనుక ధోనీ ట్రోఫీ నెగ్గితే ఈ విషయంలో రోహిత్తో సమానంగా నిలుస్తాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే ధోనీ ఈ రికార్డు సమం చేసేలాగే కనిపిస్తున్నాడు.
ధోనీ అరుదైన ఘనత..
ఇప్పటి వరకు ఐపీఎల్ 2023లో అదరగొడుతున్న ధోనీ సేన.. ఫైనల్లో కూడా చెలరేగితే ధోనీ కూడా మరో రికార్డు బద్దలు కొడతాడు. ప్రస్తుతం ధోనీ వయసు 41 సంవత్సరాలు. ఈసారి ట్రోఫీ నెగ్గితే ఐపీఎల్లో అత్యంత పెద్ద వయసులో ట్రోఫీ నెగ్గిన కెప్టెన్గా ధోనీ నిలుస్తాడు. ధోనీ కెప్టెన్సీలో ఏమాత్రం పదును తగ్గలేదని చెప్పడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
అడుగు దూరంలో గైక్వాడ్..
చెన్నై యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. 2021లో చెన్నై ట్రోఫీ నెగ్గిన సీజన్లో అతను 634 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్లో కూడా మంచి ఫామ్ కనబరుస్తున్న అతను 564 పరుగులతో ఉన్నాడు. ఫైనల్లో కనుక రుతురాజ్ 34 పరుగుల పైగా చేసి, చెన్నై ట్రోఫీ నెగ్గితే.. రెండుసార్లు ట్రోఫీ నెగ్గిన టీంలో 600 పైగా స్కోరు చేసిన బ్యాటర్గా అరుదైన ఘనత సాధిస్తాడు.