చెన్నై సూపర్ కింగ్స్కు బిగ్ షాక్ తగిలింది. వివిధ కారణాలతో సీఎస్కే అయిదుగురు స్టార్ బౌలర్లు ముస్తాఫిజుర్, దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, పతిరణా, తీక్షణ జట్టుకు అందుబాటులో లేరు. అంతేగాక వాళ్లు తిరిగి జట్టులోకి వచ్చే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్లేఆఫ్స్ రేసు కఠినంగా మారుతున్న సమయంలో ఒకేసారి అయిదుగురు బౌలర్లు జట్టుకు దూరమవ్వడం సీఎస్కేకు కోలుకోలేని ఎదురుదెబ్బగా మారింది.
అయితే సీఎస్కేకి తదుపరి మ్యాచ్కు మరో మూడు రోజుల సమయం ఉంది. ఈలోపు కనీసం ఇద్దరు అయినా తిరిగి జట్టులోకి వస్తారని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. అసలేం జరిగిందంటే.. రేపటి నుంచి జింబాబ్వేతో బంగ్లాదేశ్ అయిదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో స్వదేశానికి ముస్తాఫిజుర్ తిరిగి వెళ్తున్నాడు. జింబాబ్వేతో సిరీస్ మే 12తో ముగుస్తోంది.

కానీ మే 20 నుంచి అమెరికాతో బంగ్లాదేశ్ మరో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ పరిస్థితుల్లో ముస్తాఫిజుర్ తిరిగి సీఎస్కే జట్టుతో చేరడం దాదాపు అసాధ్యమే. మరోవైపు నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో దీపక్ చాహర్ గాయపడ్డాడు. కేవలం రెండు బంతులే బౌలింగ్ చేసి నొప్పితో మైదానాన్ని వీడాడు. చాహర్ గురించి సీఎస్కే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అతను కోలుకోవడానికి కనీసం నాలుగు రోజుల సమయం పడుతుందని సమాచారం.
ఇక తుషార్ దేశ్పాండే అనారోగ్యానికి గురయ్యాడు. అదే కారణంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్కు అతడు దూరమయ్యాడు. తుషార్ ఎప్పటికీ తిరిగి పూర్తిగా కోలుకుంటాడనే విషయంపై క్లారిటీ లేదు. అలాగే శ్రీలంక స్టార్ బౌలర్లు పతిరణా, తీక్షణ వరల్డ్ కప్ వీసా ప్రాసెస్ కోసం సీఎస్కే జట్టును వీడారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అయిదుగురు బౌలర్లు ఒక్కసారిగా అందుబాటులో లేకపోయారు.
అయితే వీసా ప్రక్రియ త్వరగా ముగుస్తుందని, ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్కు పతిరణా, తీక్షణ అందుబాటులో ఉంటారని సీఎస్కే యాజమాన్యం ఆశిస్తోంది. కాగా, పది మ్యాచ్లు ఆడిన చెన్నై అయిదింట్లో గెలిచి పది పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.