సన్రైజర్స్ హైదరాబాద్కు వరుసగా మరో ఓటమి. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 78 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. బౌలింగ్, బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది.
రుతురాజ్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో, 10x4, 3x6) తృటిలో శతకాన్ని కోల్పోయాడు. డారిల్ మిచెల్ (52; 32 బంతుల్లో, 7x4, 1x6), శివమ్ దూబె (39*; 20 బంతుల్లో, 1x4, 4x6) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం ఛేదనలో సన్రైజర్స్ 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. మార్క్రమ్ (32; 26 బంతుల్లో, 4x4) టాప్ స్కోరర్. సీఎస్కే బౌలర్లలో తుషార్ దేశ్పాండే (4/27) నాలుగు వికెట్లు, ముస్తాఫిజుర్ (2/19), పతిరనా (2/17) చెరో రెండు వికెట్లు తీశారు.

దూకుడుగా ఛేజింగ్ ఆరంభించాలనుకున్న ఎస్ఆర్హెచ్కు ఆదిలోనే కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పవర్ప్లే లోపే మూడు వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్ (13; 7, 1x4, 1x6), ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ అన్మోల్ప్రీత్ సింగ్ (డకౌట్, 1 బాల్)ను తుషార్ దేశాపాండే వరుస బంతుల్లో ఔట్ చేశాడు. కాసేపటికే అభిషేక్ శర్మ (15; 9 బంతుల్లో, 1x4, 1x6)ను కూడా తుషార్ పెవిలియన్కు చేర్చాడు.
ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన నితీశ్ రెడ్డి (15; 15 బంతుల్లో)తో కలిసి మార్క్రమ్ (32; 26 బంతుల్లో, 4x4) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. కానీ కావాల్సిన రన్రేట్ పెరిగిపోతుండటంతో వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. 11 ఓవర్లలోనే 85 పరుగులకు ఎస్ఆర్హెచ్ అయిదు వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ హెన్రిచ్ క్లాసెన్ (19; 17 బంతుల్లో, 1x4, 1x6) క్రీజులో ఉండటంతో సన్రైజర్స్ శిబిరంలో ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ క్లాసెన్ను పతిరనా ఔట్ చేసి సీఎస్కే విజయాన్ని ఖరారు చేశాడు. ఆ తర్వాత సన్రైజర్స్ బ్యాటర్లు వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు.
రుతురాజ్కు హార్ట్ బ్రేక్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కేకు శుభారంభం దక్కలేదు. అజింక్య రహానె (9; 12 బంతుల్లో, 1x4) తన పేలవ ఫామ్ను కొనసాగించాడు. కానీ వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన డారిల్ మిచెల్తో కలిసి రుతురాజ్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు రెండో వికెట్కు 64 బంతుల్లో 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అర్ధశతకం సాధించిన వెంటనే మిచెల్ ఔటయ్యాడు. అనంతరం శివమ్ దూబెతో కలిసి రుతురాజ్ బాదే బాధ్యతలు అందుకున్నాడు. 16వ ఓవర్లోనే 89 స్కోరుకు చేరుకున్న రుతురాజ్ సునాయసంగా సెంచరీ సాధిస్తాడని భావించారంతా. కానీ దూబె స్ట్రైకింగ్ ఎక్కువగా తీసుకోవడంతో ఆఖరి ఓవర్లో రుతురాజ్ భారీ షాట్కు యత్నించి శతకాన్ని కోల్పోయాడు. కాగా, ధోనీ రెండు బంతులు ఎదుర్కొని అజేయంగా అయిదు పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, నటరాజన్, ఉనద్కత్ తలో వికెట్ తీశారు.